టీఆర్ఎస్,బీజేపీల దోస్తానాపై ఆధారాలున్నాయి : పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపై మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని టిఆర్ఎస్ ప్రయత్నాలు చెయ్యటమే కాకుండా బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కయ్యిందని ఆరోపిస్తుంది. ఇక ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల విషయంలో కేటీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీతో తామ ఎప్పటికీ కలవబోమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఉత్తర, దక్షిణ ధృవాలని, ఎన్నటికి కలవవని పొన్నం తెలిపారు.
టీఆర్ఎస్, బీజేపీల దోస్తానాపై తమ వద్ద ఆధారాలున్నాయని, ఇరు పార్టీలు కలిసి డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఆ రెండు పార్టీలు కావాలనే ఉత్తుత్తి యుద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ కు లేదని విమర్శించారు. విపక్షాల నుంచి ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకు వస్తే వారిపై ఒత్తిళ్లు తీసుకువచ్చి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. విపక్షాల అభ్యర్థుల ఇళ్లలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారిని బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు పొన్నం ప్రభాకర్ .