కేసీఆర్ బంధువు శాఖలకే నిధులు: భట్టి, సీఎం అంటే బాబులా: కేసీఆర్కు గంటా
హైదరాబాద్: మజ్లిస్ పార్టీతో పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కార్యకర్తలు సూచించిన వారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు.
వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పైన మజ్లిస్ మాట్లాడలేదన్నారు. 12 శాతం రిజర్వేషన్ ఏమయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్సుమెంట్స్లో కోట్లాది రూపాయల గోల్ మాల్ జరిగిందని ఎమ్మెల్యే సంపత్ అన్నారు. జగదీశ్వర్ రెడ్డి తప్పు చేయలేదని ఎక్కడా పేర్కొనలేదన్నారు.
జగదీశ్వర్ రెడ్డిని దోషిగా నిలబెడతాం: పొన్నం
మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. జగదీశ్వర్ రెడ్డి పైన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆరోపణలు రుజువు చేసి సీఎం కేసీఆర్తోనే మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిస్తానని చెప్పారు. ఆధారాలతో రుజువు చేస్తామంటే కేసీఆర్ సరైన వేదిక ఇవ్వలేకపోతున్నారన్నారు. జగదీశ్వర్ రెడ్డి సచ్ఛీలుడని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు.
ఉద్యోగాల మాటేది: షబ్బీర్ అలీ
స్థానికులకు ఉద్యోగాలు అనే అంశాన్ని కొత్త పారిశ్రామిక విధానంలో ఎందుకు చేర్చలేదని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. పేదల ప్రయోజనాలు పట్టించుకోకుండా పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెడితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వానికి అమరవీరుల ఉసురు తగులుతుందన్నారు.
కేసీఆర్ బంధువుల శాఖలకే నిధులు: భట్టి
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులకు కాంగ్రెస్ పార్టీ వల్లే భద్రత ఉంటుందని చెప్పారు. సీఎం బంధువులు నిర్వర్తిస్తున్న శాఖలకే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు.
బాబును చూసి నేర్చుకోవాలి: గంటా
ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హితవు పలికారు.
సెక్షన్ 8 పైన కేసీఆర్ది వితండవాదమన్నారు. హామీల నుండి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ అనవసర వివాదాలు లేవనెత్తుతున్నారని ఆరోపించారు. అటార్నీ జనరల్ సూచన మేరకు గవర్నర్ మంచి సలహాలు తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.
ఆంధ్రావారికి భద్రత, భరోసా కల్పించాలనేదే సెక్షన్ 8 ఉద్దేశ్యమని ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్షన్ 8 వద్దంటున్నారని మండిపడ్డారు. సెక్షన్ 8 వద్దని, భద్రతను ఇవ్వలేమని చెబుతున్నారా అని ప్రశ్నించారు.