చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ, కెసిఆర్తో పోలికే లేదు: కెటిఆర్, కిరణ్ రెడ్డిపై సెటైర్
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్కు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు నక్కకు, నాగలోకనికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం నాడు అన్నారు.ఎన్నో సమస్యలను అధిగమించి కెసిఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.
ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో వాటర్ గ్రిడ్ పైలాన్ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండెడ్ల బండిలా నడిపిస్తోందన్నారు.
చంద్రబాబుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ పని తక్కువ అన్నారు. చంద్రబాబు పిల్లనిచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్నారు.
రైతుల ఆత్మహత్యలపై కొందరు నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సమస్యలను అధిగమిస్తామన్నారు. అరవై సంవత్సరాల గబ్బు ఒక్కసారి ఎలా పోతుందో వాళ్లే చెప్పాలన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్ష నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలో పెళ్లీడు ఆడపిల్లలుంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.51 వేలు అందజేస్తున్నామన్నారు. సమైక్య ఏపీ ఆకరి కిరణం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ప్రాంతం అంధకారంలో మగ్గిపోవాల్సిందేనని గోడపై మ్యాప్ పెట్టి ఓ కర్ర పట్టుకుని చూపించారన్నారు.
ఇవాళ కిరణ్ రాజకీయ జీవితమే రాజకీయ అంధకారంలో పడిపోయిందన్నారు. కానీ తెలంగాణలో కరెంట్ కోతలే లేవన్నారు. ఎండాకాలంలో కూడా విద్యుత్ సరఫరాకు ఆటకం కలగకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత నాణ్యమైన పాలనను అందిస్తున్నారన్నారు.