కెసిఆర్పై పోరు: బిజెపికి చెప్పానని నాగం, చెప్పలేదని కిషన్రెడ్డి ట్విస్ట్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలన దారుణంగా ఉందని ఆరోపిస్తూ.. బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ బచావో వేదికను ప్రకటించారు. అయితే, దీని పైన బిజెపిలో భిన్న స్వరాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ బచావో వేదిక పైన నాగం, కిషన్ రెడ్డి భిన్నంగా స్పందించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ... నాగం బిజెపిలోనే ఉన్నారని చెప్పారు. నాగం వేదికకు పార్టీ అనుమతి లేదని చెప్పారు. మంచి పనులు చేసినప్పుడు ఎవరైనా అభినందించాల్సిందే అన్నారు.
నాగం అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలోని పెండింగు ప్రాజెక్టుల పైన నెలాఖరు నుంచి ఉద్యమం చేస్తామని చెప్పారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగు ప్రాజెక్టలను పూర్తి చేయకుండా మిషన్ కాకతీయ పేరుతో కాలం గడుపుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు పర్యటించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.
మరోవైపు, నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ... కిషన్ రెడ్డికి చెప్పే తాను వేదికను ఏర్పాటు చేశానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలనేది తన సంకల్పం అన్నారు. అందరం ఒక్కటై తెలంగాణను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.
ప్రజా ధనాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు దుర్వినియోగం చేస్తోందన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలోని మంత్రులు అంతా డమ్మీలే అన్నారు. ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లో చేర్చుకోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు. కెజీ టు పిజి విద్య, కరవు, అవినీతి.. ఇలా ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాడుతామని చెప్పారు.