ఎంపీ అభ్యర్థులు వీళ్లే..! ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్న టీ టీడిపి..!!
హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ లోక్ సభ ఎన్నికలకు సంసిద్దమౌతోంది. నాయకత్వం లేకపోయినా, క్యాడర్ పటిష్టంగా ఉందని, పార్టీనే నమ్ముకుని ఉన్న పర్టీ శ్రేణులకు అండగా ఉండాలని తెలంగాణ టీడిపి భావిస్తోంది. అందుకోసం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి కార్యకర్తల్లో భరోసా నింపాలని టీడిపి కసరత్తు చేస్తోంది. పార్టీ క్యాడర్ అత్యంత కీలకంగా పనిచేసే ఐదు పార్లమెంట్ నియోజక వర్గాల్లో పోటీ చేసేందకు తెలంగాణ టీడిపి వ్యూహం రచిస్తోంది. ఇందులో బాగంగా మూడు సిగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా మిగిలిన రెండు నియోజక వర్గాల్లో ఖరారు చేయాల్సి ఉన్నట్టు సమాచారం.
లోక్ సభ ఎన్నికల్లో టీటీడిపి..! ఐదు నియోజక వర్గాల్లో పోటీ చేసేందకు సై..!!
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తుండగా, తెలంగాణలో మాత్రం పట్టు కోల్పోయి కష్టాలు పడుతోంది. కొద్దిరోజుల క్రితం ముగిసిన ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ, కాంగ్రెస్ సహా మరో రెండు పార్టీలతో జట్టు కట్టినా గెవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 చోట్ల విజయం సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది.
అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న ముఖ్య నేతలు..! గెలుపు గుర్రాల కోసం వేట...!!
ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది ఆ పార్టీ అధిష్ఠానం. దీనికితోడు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడంతో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? అన్న సందిగ్దంలో ఉన్న ఆ పార్టీ నేతలు ఉండిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో టీడిపి క్యాడర్ ను సంతోషపెట్టే వార్త బయటికి వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు, పాత కొత్త కలయికలతో పోటీ ఉంటుందని తెలుస్తోంది.
క్యాడర్ లో భరోసా నింపాలనుకుంటున్న టీడిపి..! అందుకే లోక్ సభకు పోటీ..!!
విభజన తర్వాత రాష్ట్రంలో క్యాడర్ ఉన్నా నాయకత్వలేమితో బాధపడుతోంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో ఎలాగైన ప్రభావం చూపించాలని నిర్ణయించుకున్నారు ఆ పార్టీ నేతలు. అందుకోసమే రాష్ట్రంలోని ముఖ్యమైన పార్లమెంట్ స్థానాలపై కన్నేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందులో ముఖ్యంగా దేశంలోనే పెద్దదైన మల్కాజిగిరి స్థానాన్ని గెలుచుకోవాలని టీడిపి క్రతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు.
ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు రెడీ..! మిగిలిన అభ్యర్థుల ఎంపిక కోసం టీడిపి కసరత్తు..!!
సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిని మరోసారి దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే సీనియర్ నేత దేవేందర్గౌడ్ను తమ అభ్యర్ధిగా నిలబెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో పాటు ఖమ్మం. మహబూబాబాద్, సికిందరాబాద్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలని తెలంగాణ టీడిపి భావిస్తోంది. ఖమ్మం నుండి నామా నాగేశ్వర రావును రంగంలోకి దించేందుకు టీడిపి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సికిందరాబాద్ నుండి టీడిపి సీనియర్ మహిళా నాయకురాలు విజయ రావు పోటీలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె సికిందరాబాద్ నియోజక వర్గ నేతలతో పలు సమావేశాలు కూడా నిర్వహించినట్టు సమాచారం. ఇక మహబూబాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థులపై తెలంగాణ టీడిపి పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.