అవి బస్సులు కాదు కదిలే పొగ భూతాలు ! విశ్వ నగరానికి కాలుష్య శాపం..!!
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎక్కువుగా కాలం చెల్లిన ద్విచక్రవామనాల వాడకంతో పాటు బస్సులతో కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో నగరవాసులు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. జంటనగరాలలో తిరుగుతున్న వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని అంచనా వేయగా ప్రమాదభరితంగా ప్రతీరోజు 15 వందల టన్నుల కాలుష్యం విడుదల చేస్తున్నట్లు తేలింది. ఇది తెలంగాణ రవాణాశాఖ వెబ్సైట్లో అధికారికంగా పొందుపరిచిన విషయం. దీంతో నగరవాసులు కాలూష్యం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నట్టు తెలుస్తోంది.
నగరంలో పెరుగుతున్న కాలుష్యం..! పట్టించుకోని పీసిబీ యంత్రాంగం..!!
క్రమేపీ పెరుగుతున్న వాహనాల వల్ల వీటి సాంద్రత పెరుగుతుంది. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులతోపాటు గుండెజబ్బులు, చర్మానికి సంబంధించిన అలర్జీ వంటి వ్యాధులు ఎక్కువగా నగరవాసులను బాధిస్తున్నాయని తేలింది. ఈ విషయాన్ని నగరంలోని విశ్వేశ్వరయ్యభవన్లో ఏయిర్ పోల్యూషన్పై జరిగిన సెమినార్ సందర్భంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ నివేదికను వెల్లడించింది. ఇప్పటికే నగరం కిలోమీటరుకు 35,600 వాహనాలతో అక్యుపైచేసింది. ఇది 2021 వరకు 51,220 కి చేరుకోనుందని సర్వేలో వెల్లడించారు.
ఆర్టీసి బస్సుల పొగ భరించలేమంటున్న నగర వాసులు..! ప్రత్యామ్నాయం దిశగా ప్రభుత్వం..!!
అయితే నగర పరిధిలో వాహనాల సంఖ్య ఇప్పటికే 60 లక్షలకు చేరుకోగా అందులో టూ వీలర్స్ అతి ఎక్కువగా ఉండి కాలుష్యాన్ని వెదజల్లడంలో అగ్రభాగంలో ఉన్నాయి. వాయు కాలుష్యం విషయంలో 56.2 శాతం ద్విచక్రవాహనాలదేనని పొల్యూషన్ కంట్రోల్బోర్డు, రవాణాశాఖ సంయుక్త సర్వేలో వెల్లడైంది. వీటి తర్వాత త్రీవీలర్స్ 34 శాతం వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. వ్యక్తిగత వాహనాలను తగ్గించి ప్రజారవాణావ్యవస్థను మెరుగుపరుచడంతో పాటు బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలతో ముప్పునుండి బయటకు రావచ్చని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
అడ్రెస్ లేని ఎలక్ట్రిక్ వాహనాలు..! నియంత్రణ ఎలా..!!
వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్రోరైలు రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవడంతోపాటు, పూర్తిస్థాయిలో బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే విద్యుత్తో నడిచే కార్లతో పాటు బస్సులను కూడా నగర ప్రయాణంలో కీలకం చేసింది. భవిష్యత్తులో మరిన్ని బస్సులను తేవడానికి ప్రయత్నం చేస్తున్నది.
బ్యాటరీ వాహనాలపై ద్రుష్టి..! ఎప్పుడు వస్తాయో అందుబాటులోకి మరి..!!
వీటితోపాటు మెట్రో లాస్ట్ అండ్ ఫస్ట్ మైల్ కనెక్టివిటీలో బ్యాటరీ ఆపరేటెడ్ రిక్షాలను అందుబాటులోకి తెస్తున్నారు. నగర వ్యాప్తం గా బ్యాటరీ రీచార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్ వాహనాల వాటాను సాధ్యమైనంత త్వరగా తగ్గించడానికి సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలను కూడా ప్రోత్సహిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని కూడా రూపొందించింది.