'బైకులెక్కింది ఫోటో ఫోజుల కోసమే, ఎస్పీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర రావులు బైకులు ఎక్కింది ట్రాఫిక్ కంట్రోల్ కోసం కాదని, ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఆదివారం మండిపడ్డారు.
గోదావరి పుష్కరాలకు సదుపాయాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ట్రాఫిక్ వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. మంత్రులు బైకులు ఎక్కి ట్రాఫిక్ నియంత్రిస్తున్నట్లు ఫోజులు ఇస్తున్నారని, నిజానికి వారంతా నియంత్రణ కోసం బైకులు ఎక్కడం లేదని, ఫోటోలకోసం అన్నారు.
మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర రావు, ఈటెల రాజేందర్లు బైకులు ఎక్కి హడావుడి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు బైకుల పైన తిరిగినంత మాత్రాన ట్రాఫిక్ కంట్రోల్ కాదన్నారు.
సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం పుష్కరాల గురించి ఎందుకు ప్రచారం చేసిందన్నారు. తాను ఎస్పీకి ఫోన్ చేశానని, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ ట్రాఫిక్ పోలీసుల వల్లనే కావడం లేదని, ఇక మంత్రుల వల్ల ఎలా అవుతుందని ప్రశ్నించారు.
కుంభమేళాను తలపిస్తోంది: వేణుగోపాలాచారి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలు కుంభమేళాను తలపిస్తోందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలా చారి అన్నారు. భద్రాచలం పుణ్య క్షేత్రంలో ఆయన పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
గోదావరి పుష్కరాలను నిర్వహిస్తోన్న ఘనత కేసీఆర్కే చెందుతుందన్నారు. మంత్రులు, సీనియర్ అధికారులు, నేతలతో సమీక్షలు జరిపి కట్టుదిట్టమైన ప్రణాళికను సీఎం రూపొందించారని వివరించారు. గోదావరి నదీ తీరాన ఉన్న గ్రామాల్లో పలుచోట్ల పుష్కర ఘాట్లను నిర్మింపజేశారన్నారు.
ఇవాళ భద్రాద్రిలోనే కాకుండా బాసర, ధర్మపురి, కాళేశ్వరంలో పుష్కరాలు జరుగుతున్నాయన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో ఏనాడు పుష్కరాలను ఇలా ఘనంగా నిర్వహించలేదన్నారు. సమైక్య రాష్ట్రంలో ఒక ప్రాంతానికే పరిమితమైన పుష్కరాలు ఇవాళ గోదావరి తీరం మొత్తం కొనసాగుతున్నాయన్నారు.