అమ్మా.. అక్కా.. అంటూనే?: సూర్యాపేటలో మహా మాయగాడు.. ఎట్టకేలకు చిక్కాడు
సూర్యాపేట జేజేనగర్కు చెందిన నరందాసు మణికంఠ దొంగతనాలకు అలవాటు పడ్డాడు.
సూర్యాపేట: ' అక్కా.. దాహమవుతుంది.. మంచి నీళ్లిస్తారా?' అని ధీనంగా అడిగితే.. ఎవరు మాత్రం కాదంటారు. పాపం.. ఎండలో పడి తిరుగుతున్నాడేమో అనుకుని కిచెన్ లోకి కెళ్లి మంచి నీళ్లు తీసుకొస్తారు. కానీ ఈలోపే.. ఇంట్లో ఏదో ఒకటి మాయం అవుతుంది.
నల్గొండ జిల్లా సూర్యాపేటలో గత కొన్నేళ్లుగా ఇదే రీతిలో దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద అనుమానాస్పద రీతిలో సంచరిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి.
ఎవరీ దొంగ?:
సూర్యాపేట జేజేనగర్కు చెందిన నరందాసు మణికంఠ స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఇదే క్రమంలో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. సెప్టెంబర్ 15న స్థానిక 60 ఫీట్ల రోడ్డులో గల ఓ ఇంటికి వెళ్లి దప్పిక వేస్తుందని.. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని మాటల్లోకి దింపి బంగారు గొలుసు, ముత్యపు ఉంగరం, రూ.600 గల పర్సును దొంగిలించాడు. ఉంగరాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి రూ.6700 తీసుకుని వాడుకున్నాడు.
కబేళా బజారులోని ఇంట్లో:
సెప్టెంబర్ 26న సూర్యాపేటలోని కబేళా బజారులో ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బీరువా సీక్రెట్ లాకర్ను పగులగొట్టి బీరువాలో గల పుస్తెల తాడు, ఉంగరం, దిద్దులు, లక్ష్మీదేవి బిల్ల, వెండి కుంకుడుకాయ, పర్సు దొంగలించాడు.
నకిరేకల్లో తాకట్టు:
సూర్యాపేట కబేళా బజారులో దోచుకున్న బంగారాన్ని నకిరేకల్కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి వద్ద తాకట్టు పెట్టాడు. ఉంగరం, దిద్దు బుట్టలు అతని వద్ద తాకట్టు పెట్టాడు. పుస్తెల తాడును సూర్యాపేట ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టుపెట్టి రూ.39000 తీసుకున్నాడు.
కొత్త బస్టాండ్ వద్ద అదుపులోకి:
మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో.. మణికంఠ అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజయం బయటపడింది.
బంగారు ఆభరణాలు స్వాధీనం:
మణికంఠ వద్ద నుంచి బంగారు గొలుసు, లక్ష్మీదేవి బొమ్మ గల బంగారు బిల్ల, బంగారు చెవి దిద్దుబుట్టా, వెండి కుంకుడుకాయ లభ్యమయ్యాయి. వీటిపై విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి సుమారు రూ. 1.50 లక్షల విలువ చేసే ఐదు తులాల ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో జైలుకెళ్లాడు:
మణికంఠ గతంలోను సూర్యాపేటలో దొంగతనాలకు పాల్పడ్డాడు. 2016, డిసెంబర్లో సూర్యాపేటలో మూడు చోరీలకు పాల్పడి.. పోలీసులకు పట్టబడటంతో జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసుల్లో 8 నెలల శిక్ష అనుభవించాడు. ఆగస్టులో జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి చోరీలకు పాల్పడుతున్నాడు.
వరుసలు పెట్టి పిలుస్తూ..:
ఏ ఇంటికెళ్లినా.. ఏదొక వరుసతో పరిచయం ఉన్న వ్యక్తిగా మెలగడం మణికంఠ శైలి. అమ్మా.. అక్కా.. దాహమవుతుంది మంచినీళ్లిస్తారా? అనో, లేక మరేదైనా సహాయం చేయమనో ప్రాధేయపడినట్లు నటిస్తాడు. మణికంఠ నటనను ఎదుటోళ్లు నిజమేనని నమ్మేస్తే ఇక అతని పని సులువు అయినట్లే. అందినకాడికి దోచుకుని ఉడాయిస్తాడు.