వేసారు కన్నం..! చేసారు మాయం..! వినూత్న రీతిలో మద్యాన్ని దొంగిలించిన దొంగ తాగుబోతులు..!!
పాలమూరు/హైదరాబాద్ : ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తుంటే.. సూరులో చుట్ట కాలిపోయి మరొకడు ఏడ్చాడట. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో పరిస్థితులు అచ్చం ఇలాగే పరిణమించాయి. మందు కనిపెట్టబడని కరోనా మహమ్మారి మానవాళి మీద మూకుమ్మడి దాడిచేస్తున్న తరుణంలో స్వీయ నియంత్రణ ఒక్కటే సురక్షిత మార్గం అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
మద్యం ప్రియుల విన్యాసాలు.. మద్యం కోసం దొంగతనాలు చేస్తున్న తాగుబోతులు..
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రోడ్ల పై ఎవ్వరిని అనుమతించకపోవడంతో పాటు గత 38రోజులుగా అమలులో ఉన్న ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసాయి. సరిగ్గా ఇక్కడే మద్యం ప్రియుల గుండెల్లో పిడుగుపడ్డట్టయ్యింది. దాదాపు గత 40రోజులుగా మద్యం దొరక్క నానా ఇబ్బందులు పడ్డ మద్యం ప్రియులు లాక్ డౌన్ సడలింపుల పట్ల చెకోర పక్షుల్లా ఎదురు చూసారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశా నిశ్చేష్టులైపోయినట్టు తెలుస్తోంది. దీంతో సహనం కోల్పోయిన మద్యం ప్రియులు జూలు విదిల్చినట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ ఆంక్షలు పొడిగింపు.. బిక్కచచ్చిన మద్యం ప్రియులు..
లాక్ డౌన్ ఆంక్షల కొనసాగింపు, సడలింపులతో సంబంధం లేకుండా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మూసి ఉన్న మద్యం దుకాణాలను టార్గెట్ చేసి తమకు కావాల్సిన మద్యాన్ని తస్కరించాలని పథకం రచించారు. అనుకున్నదే ఆలస్యం తమ బృహత్కర ప్రాణాళికలు అమలుచేసారు దొంగ మద్యం ప్రియులు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూత పడడంతో మద్యం దొరకడం చాలా కష్టంగా మారింది. దీంతో మద్యం ప్రియులు నరాలు తెగిపోయినట్టు, నాలుక జివ్వుమంటున్నట్టు మానసిక ఒత్తిడికి లోనయ్యారు.
ఇక సహనంగా ఉండలేం.. మందు కావాల్సిందే అంటున్న మద్యం ప్రియులు..
ప్రభుత్వ ఆంక్షలకు భయపడో, కుటుంబ సభ్యులకు భయపడో లేక రకోనా వైరస్ కు భయపడో కొంత కాలం మద్యానికి దూరంగా ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ షాపులు తెరుచుకుంటాయి, మద్యం అందుబాటులోకి వస్తుందని ప్రతిరోజూ ఎదురు చూస్తున్న తరుణంలో లాక్ డౌన్ పట్ల కేంద్రం తాజా నిర్ణయంతో మద్యం ప్రియులు ఒక్క సారిగా అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా తాగుడుకు దూరంగా ఉంటుండడంతో మద్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కొంత మంది వైన్స్ యజమానులు,సిబ్బంది బ్లాకులో మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
మద్యం షాపులకు కన్నాలు.. మద్యాన్ని మాయం చేస్తున్న దొంగ తాగుబోతులు..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం న్యూ టౌన్ చౌరస్తాలోని గోకుల్ వైన్స్లో వినూత్న తరహాలో మద్యం మాయమైంది. మద్యం దుకాణానికి వేసి ఉన్న తాళాలు వేసి ఉన్నట్టే ఉన్నాయి, కాని దుకాణంలో ఉండాల్సిన మద్యం మాత్రం మాయమయ్యింది. దుకాణం వెనక నుంచి గోడకు రంధ్రం చేసి, లక్షల రూపాయల విలువైన మద్యం చోరీకి పాల్పడ్డారు దొంగ మద్యం ప్రియులు. ఆ దృశ్యాలు సీసీ కెమెరా టీవీల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. దొంగతనం వెనక వైన్ షాపు యజమాని పాత్ర ఉండడం టోటల్ ఎపిసోడ్ కే హైలైట్ గా చర్చ జరుగుతోంది.