దారణం: యజమాని నోట్లో యాసిడ్ పోసి 15 తులాల బంగారం చోరీ
హైదరాబాద్: జ్యువెలరీ వర్క్షాపు యజమాని నోట్లో గుర్తు తెలియని దుండగలు యాసిడ్ దాడి చేసి 15 తులాల బంగారు నగలను దోచుకెళ్లిన ఘటన నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రబాబు కథనం ప్రకారం ఓల్డ్ సఫిల్ గూడ పీబీ కాలనీలో వైట్ ఫీల్డ్ రెసిడెన్సీలో నివసించే మోహన్ (39) పూలపల్లి బాలయ్యకాలనీలో శ్రీసాయి బాలాజీ జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు.
అయితే, శుక్రవారం ఉదయం 9 గంటలకు జ్యువెలరీ షాపుకు బయల్దేరి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాక పోవడంతో అతని భార్య సరోజ మోహన్కు ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తక పోవడంతో కుమారునితో కలిసి షాపు వద్దకు వెళ్లారు. షట్టర్ పైకి ఎత్తి చూడగా మోహన్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే స్థానికుల సాయంతో మోహన్ను కుషాయిగూడలోని జీనీయా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న నేరేడ్మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం కాలనీల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితులు తెలిపిన కథనం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం బైక్ వచ్చిన ఇద్దరు అగంతకులు బంగారం ధర ఎంత ఉందని వాకబు చేశారు.
మోహన్తో బంగారం ధర గురించి వాకబు చేస్తూనే ఇద్దరిలో ఒక వ్యక్తి పక్కనే ఉన్న సుత్తితో మోహన్ తలపై మోదాడు. దీంతో మోహన్కు దొంగలుగా అనుమానం వచ్చి కేకలు వేయడంతో దుండగులు పక్కనే ఉన్న యాసిడ్ను అతని నోట్లో పోశారు. అతని వద్ద ఉన్న బంగారం బ్యాగును తీసుకువెళ్తూ షట్టర్ను కిందికి లాగి ఉడాయించారు.