పెళ్ళింట్లో 24 తులాల బంగారం చోరీ, వరుడి తండ్రి సూసైడ్, అంతలోనే ట్విస్ట్..
నాగర్కర్నూల్: పెళ్ళి ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనతో మనస్థాపానికి గురైన వరుడి తండ్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఆత్మహత్య చేసుకొన్న తర్వాత దోపిడికి గురైన బంగారం దొరికింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో విషాదానికి కారణమైంది.
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం కోడుపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి(45) పెద్దకుమారుడు రాందేవ్రెడ్డికి ఈనెల 19న గురువారం నాడు వివాహమైంది. జడ్చర్లలోని ఓ ఫంక్షన్హాల్లో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి కోడుపర్తికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులతో సహా ఇంటికి వచ్చారు.
రాత్రి పూట భోజనాలు చేశాక బంధువుల వద్ద ఉన్న బంగారు నగలను సూట్కేసులో భద్రపర్చి అంతా కలసి మేడపై పడుకొన్నారు.. శుక్రవారం తెల్లవారేసరికి సూట్కేసులోని 24 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన శ్రీనివాస్రెడ్డి తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ సన్ప్రీత్సింగ్తో సహా పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు.
అయితే ఇది దొంగల పనికాదని బంధువల్లో ఎవరో ఒకరు బంగారాన్ని దోచుకొన్నారని పోలీసులు అనుమానించారు. బంధువులను వేర్వేరుగా ప్రశ్నించారు. స్టేషన్కు తీసుకెళ్ళి విచారణ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఏప్రిల్ 20 వ తేదిన సత్యనారాయణ స్వామి వ్రతం చేయాల్సి ఉండగా బంగారం పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దొంగతనం ఎవరు చేశారనే అనుమానంతో బంధువులను ప్రశ్నించిన పరిస్థితి రావడం, ఆభరణాలు దొరకకపోతే వాటిని తానే బంధువులకు ఇవ్వాల్సిన బాధ్యత నెలకొనడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయమై శుక్రవారం రాత్రిపూటా వ్యవసాయబావి వద్దకు వెళ్ళి తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టు వరుడు రాందేవ్రెడ్డికి ఫోన్ చేసి చెప్పి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.అయితే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ముందే దొంగలు తాము దోచుకొన్న బంగారాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని రోడ్డుపై పారేశారు.
ఈ విషయం ముందు తెలిసినా శ్రీనివాస్ రెడ్డి ప్రాణాలు దక్కేవని ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్ళైన ఇంట్లో ఆ ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.