మధ్యాహ్నాం ఒంటిగంట..: బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు, సినీ ఫక్కీలో..
హైదరాబాద్: బంగారం వ్యాపారి నిత్యాదాస్ జ్యువెలరీ కార్ఖానాలో బంధిపోటు దొంగలు బీభత్సం సృష్టించారు. పాతబస్తీలోని పేట్లబురుజు సమీపంలో ఉన్న కార్ఖానాపై మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దుండగులు విరుచుకుపడ్డారు. కత్తులు, కర్రలతో బెదిరించి.. సిబ్బందిని కట్టేసి సుమారు 5కేజీల బంగారంతో ఉడాయించారు.
సీఏఆర్ హెడ్క్వార్టర్స్ వెనుకాలే..:
పశ్చిమబెంగాల్కు చెందిన నిత్యాదాస్ ఈ జ్యువెలరీ కార్ఖానా నిర్వహిస్తున్నారు. దీని ప్రధాన బ్రాంచ్ ముంబైలో ఉండగా.. హైదరాబాద్ సీఏఆర్ హెడ్క్వార్టర్స్ వెనుక మరో కార్ఖానా ఉంది. షేర్ అలీ తబేలాలోని ముజీబ్ అనే వ్యక్తికి చెందిన మూడంతస్తుల భవనంలో.. గ్రౌండ్ఫ్లోర్లో కార్ఖానా నడుస్తోంది.
ముంబై వెళ్లిన మేనేజర్..:
గత ఆరేళ్లుగా నడుస్తున్న ఈ కార్ఖానాలో బెంగాల్ కు చెందిన అనేకమంది పనిచేస్తున్నారు. కొంతమంది మధ్యలోనే మానేసి వెళ్లిపోయినవారు ఉన్నారు.
ఇదిలా ఉంటే, నిత్యదాస్ ఇటీవల కంపెనీ పనుల నిమిత్తం ముంబై వెళ్లారు.దీంతో కంపెనీకి మేనేజర్ గా ఉన్న మేనల్లుడు సాహేబ్దాస్ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కార్ఖానాలోకి దుండగులు చొరబడ్డారు.
మధ్యాహ్నాం ఒంటిగటకు..:
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 8-10 మంది దుండగులు కత్తులు, కర్రలతో ఒక్కసారిగా కార్ఖానాలోకి ప్రవేశించారు. లోపలికి రావడమే ఆలస్యం.. తలుపులన్ని మూసేసి సిబ్బందిని కత్తులతో బెదిరించారు.
అందరిని ఒక చోటకు చేర్చి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. కేకలు పెడితే చస్తారని బెదిరించారు. సుమారు 5కేజీల బంగారాన్ని బ్యాగులో నింపుకుని ఉడాయించారు.
తెలిసినవారి పనేనా?:
కార్ఖానాలో దోపిడీ తెలిసినవారి పనే అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోపలికి ప్రవేశించిన దుండగులు.. ఎక్కడెక్కడ ఏం ఉందో తమకు తెలిసినట్టే కలియతిరిగారని కార్మికులు చెబుతున్నారు.
బయటి వ్యక్తులకు ఎవరికీ తెలియని, బయటకు కూడా కనిపించని ఓ బీరువా గురించి కూడా వారు ఆరా తీయడం ఇందుకు ఊతమిస్తోంది. ఆ బీరువా తెరిపించి అందులో నుంచి 1100గ్రాముల బంగారం దోచుకెళ్లారు.
పోలీసుల అనుమానం..:
దోపిడీ సమయంలో 20మంది కార్మికుల్లో ఎవరూ ప్రతిఘటించకపోవడం కూడా పోలీసులకు అనుమానం కలిగిస్తోంది. కార్మికులు కూడా వారితో కుమ్మక్కయ్యారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.
కాగా, దోపిడీ తర్వాత కార్ఖానా నుంచి దుండగులు ఫిర్దోష్ స్కూల్ వైపు వెళ్లినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.