బైక్పై వచ్చి ఎమ్మెల్సీ భార్య హ్యాండ్బ్యాగ్ చోరీ
హైదరాబాద్: ఆటోలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ భార్య ఇందిర హ్యాండ్ బ్యాగును బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు లాక్కుపోయారు. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ భార్య ఇందిర బుధవారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో ఆటోలో హైదర్గూడ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్కు వెళ్తున్నారు. హైదర్గూడ కూడలిలో సిగ్నల్ పడటంతో ఆటో వేగం తగ్గింది. అంతలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు రెప్పపాటులో ఇందిర హ్యాండ్ బ్యాగును లాక్కుపోయారు.
దీంతో ఇందిర పోలీసులను ఆశ్రయించారు. ఆ బ్యాగులో రూ. 5వేల నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇద్దరు ఘరానా దొంగల అరెస్టు
చోరీలకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు ఘరానా దొంగలను గురువారం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ.7 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. డిఐ బల్వంతయ్య కథనం ప్రకారం.. ఉప్పుగూడ ఛత్రినాక తంజానగర్లో నివసించే బి. రాజ్కుమార్ (24) టీ విక్రయిస్తూ జీవిస్తున్నాడు. మీర్చౌక్లోని అజంతా కోట్లకు చెందిన అలీ మెకానిక్ (24). రాజ్కుమార్ తాళాలు పగులగొట్టి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతుంటాడు.
ఇతనిపై గతంలో 63 చోరీ కేసులతో పాటు హత్య కేసు నమోదయ్యాయి. అలీ కూడా దొంగతనాలు చేసి 4 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కాగా అనుమానాస్పదంగా చిక్కడపల్లిలో తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా రాత్రి వేళల్లో తాళాలు వేసిన దుకాణాలు, ఇళ్లల్లో చోరీ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు రెండు ద్విచక్రవాహనాలు, బంగారు ఉంగరాలు, గొలుసులు, రెండు ల్యాప్టాప్లు, సెల్ఫోన్, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.