ముగిసిన మూడో, చివరి పంచాయతీ ఎన్నికలు: టీఆర్ఎస్ మద్దతుదారులదే హవా!
హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ, తుది పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 32వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
11,667 మంది సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డుల్లో 67,316 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు.
మొదటి విడతలో 4,135, రెండో విడతలో మొత్తం 4,135 పంచాయతీలకు, మూడో విడతలో మొత్తం 3,529 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. తొలి రెండు విడతల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులే ఎక్కువగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. దాదాపు డెబ్బై శాతం స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోగా, మిగతా స్థానాలను కాంగ్రెస్, ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.