ఎపిలో చిక్కుపడిన బాబు: కెసిఆర్ దూకుడు, మమతాతో భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యల్లో చిక్కుపడిన నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దూకుడు పెంచారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల వంటివాటి విషయంలో కేంద్రంపై పోరాటం చేయడంలోనే చంద్రబాబు మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని, అందుకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికోసం ఆయన కార్యాచరణ రూపొందించి అమలు చేసే పనిలో పడ్డారు.
ఎల్లుండి మమతతో కేసిఆర్ భేటీ
కేసిఆర్ కోల్కతా పర్యటనకు తేదీ ఖరారైంది. ఆయన సోమవారంనాడు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఫ్రంట్ ఏర్పాటుపై ఆయన మమతా బెనర్జీతో చర్చలు జరుపుతారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వెంటనే మమతా బెనర్జీ కేసిఆర్కు ఫోన్ చేసి ఆయనను అభినందించారు.
చంద్రబాబుపై అలా వార్తలు
చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలోని పలు పార్టీల నాయకులతో చర్చించారని ఓ జాతీయ చానెల్ వార్తాకథనాన్ని ప్రచురిస్తూ ఆ పార్టీల జాబితా కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఎ నుంచి తెలుగుదేశం వైదొలిగింంది. దాంతో ఆ జాతీయ చానెల్ వార్తాకథనానికి కొంత విశ్వసనీయత లభించింది.
ఎపికే చంద్రబాబు పరిమితం
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతున్నా దానిపై ఆయన అంతగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆయనకు ప్రథమ ప్రాధాన్యంగా నిలిచిందని అంటున్నారు. అయితే దీంతో కేసీఆర్కు థర్డ్ ఫ్రంట్ కసరత్తుకు తగిన సమయంగా మారింది.
వినోద్ కుమార్ ఇలా అన్నారు..
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసిఆర్ దూకుడు పెంచిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ కీలకమైన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్పీ, ఎస్పీ కలిసి పోటి చేయడంతో రెండు జాతీయ పార్టీల చిరునామా గల్లంతైందని అన్నారు.
ఆ రెండు పార్టీలకు అది కష్టం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, బిజెపిలకు మూడంకెల స్థానాలు రావడం కష్టమని వినోద్ కుమార్ అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో అధికారాన్ని నిర్ణయిస్తాయని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు పరిశీలిస్తున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు కూడా వాటిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.