ఫెడరల్ ఫ్రంట్ కథ కంచికేనా ..! సార్వత్రిక ఎన్నికల వేళ కేసీఆర్ మౌనం దేనికి సంకేతం ?
హైదరాబాద్ : అవసరమైతే జాతీయ పార్టీ పెడతా.. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ పెడతా. రానున్న ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో కీలకం అవుతుంది. గుణాత్మక మార్పులకు ఫెడరల్ ఫ్రంట్ కారణమవుతుంది. ఈ మాటలు గుర్తున్నాయి కదా..! గులాబీ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊదరగొట్టిన మాటలివి. తెలంగాణలో మొదటి దశలోనే ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఆరు దశలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి గతంలో చంద్రశేఖర్ రావు వెళ్లి కలిసి, ఫెడరల్ ఫ్రంట్లో చేరాలని ఆహ్వానించిన పార్టీల తరఫున ప్రచారం ఎందుకు చేయడం లేదు.? కనీసం ఆ ఫ్రంట్ ఊసు కూడా ఎత్తడం లేదు. కానీ ఇదే సమయంలో బీజేపీయేతర ఫ్రంట్ పేరిట చంద్రబాబు ఓ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ ఫ్రంట్ కోసం చంద్రబాబు పలుచోట్ల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో చంద్రశేఖర్ రావు అనుకున్న ఫెడరల్ ఫ్రంట్ మాటలకే పరిమితమైందా.? అన్న అనుమానం తలెత్తుతోంది.
ఆ పార్టీలన్నీ చంద్రబాబు ఫ్రంట్లోకి..! మరి కేసీఆర్ ఫ్రంట్ ఎటు పాయె..!!
కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది చంద్రశేఖర్ రావు లక్ష్యం. వాస్తవానికి కేంద్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను కాదని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినప్పటికీ గులాబీ బాస్ ఓ ప్రయత్నం చేశారు. జేడీఎస్, బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీ అధినేతలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యాలు వివరించారు. ఆ తర్వాత ఇందులోని నేతలందరూ ఫెడరల్ ఫ్రంట్పై ఆసక్తి చూపలేదు. ఒక్క బీజేడీ నేత నవీన్పట్నాయక్ మినహా మిగిలిన వారందరూ చంద్రబాబు ప్రతిపాదించిన బీజేపీయేతర ఫ్రంట్ వైపే అడుగులు వేస్తున్నారు.
ఎన్నికల వేళ వ్యూహాత్మక మౌనం..! ఫ్రంట్పై నోరు మెదపని గులాబీ బాస్..!!
అలాగే చంద్రబాబు తరఫున ఆంధ్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు జాతీయ నేతలు వచ్చారు. మమతాబెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, దేవేగౌడ.. ఇలా అందరూ చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అంటే చంద్రబాబు ఫ్రంట్కే వారి మద్దతు. ఇది చంద్రశేఖర్ రావు కు మింగుడు పడని పరిణామంగా మారింది. తనకు మద్దతుగా వస్తారని భావించిన వారందరూ చంద్రబాబు ఫ్రంట్లో కొనసాగడంతో చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల తర్వాత కూడా ఈ ఫ్రంట్ ఫ్రభావం తక్కువగానే కనిపిస్తోంది. తమ భాగస్వామ్య పక్షాల తరఫున ప్రచారానికి చంద్రబాబు వెళుతున్నారు. అయితే.. చంద్రశేఖర్ రావు మాత్రం ఎవరి తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లలేదు.
కలిసి వచ్చే పార్టీల కోసం ప్రచారానికి వెళ్లని వైనం..! కారణం ఏంటో అంతు చిక్కదు..!!
నిజానికి ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లోని ఖరగ్పూర్లో తెలుగు ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంటుంది. బెంగళూరులోని రెండు లోక్సభ స్థానాల్లో తెలుగు ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే వారే గెలుస్తారు. అయినప్పటికీ అక్కడ ఫెడరల్ ఫ్రంట్లోని పార్టీల కోసం చంద్రశేఖర్ రావు వెళ్లడం లేదు. ఆయా పార్టీలు ఆహ్వానించలేదా.. లేక చంద్రశేఖర్ రావు స్వయంగా వెళ్లలేదా అన్న అంశం తేలాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్టుగా ఇటీవల ఓ సమావేశంలో తమ పార్టీకి ఎన్నికల తర్వాత కేంద్రంలో నాలుగు మంత్రి పదవులు వస్తాయని ప్రకటించడం సంచలనంగా మారింది.
ఎన్నికల తర్వాత బీజేపీతో కలిస్తే..! కేసీఆర్ వ్యూహం ఏంటి..!!
దీంతో ఒకవైపు బీజేపీతో సంబంధాలు పెట్టుకుని.. ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ప్రచారానికీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది బీజేపీయేతర ఫ్రంట్గా చంద్రశేఖర్ రావు అభివర్ణించారు. అలాగే గులాబీ బాస్ ఆహ్వానించిన పార్టీలన్నీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి ప్రచారం చేయడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు ఉంటుంది. తిరిగి ఎన్నికల తర్వాత బీజేపీతోనే కలవాల్సిన పరిస్థితి. అందుకే ఫెడరల్ ఫ్రంట్ ఊసు ఎత్తకుండా చంద్రశేఖర్ రావు సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.