ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు: అక్బరుద్దీన్, టార్గెట్ మోడీ-రాహుల్-సోనియా
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా తన ఆరోగ్యం బాగా లేదని, తన కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు. కిడ్నీల సమీపంలో బుల్లెట్ ముక్కలు ఉన్నాయనిచెప్పారు. డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారని అన్నారు.
తన ఆరోగ్యం గురించి చూసుకోవడానికి సమయం లేదని, తన స్కూల్స్, దారుసలేమ్ బ్యాంకులు, ఆసుపత్రులతో పాటు తన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సి ఉందని చెప్పారు. తనకు ఇవి చివరి ఎన్నికలు కావొచ్చునని చెప్పారని వార్తలు వస్తున్నాయి.
వారి ఓటమి కోసం పని చేస్తాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నియోజకవర్గాలలో పర్యటించి 2019లో వారి ఓటమికోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తామని అక్బరుద్దీన్ వేరుగా ప్రకటించారు. దేశంలో 4,200 మంది శాసనసభ్యులుంటే ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్ గురించి మోడీ, రాహుల్ ఇతర నేతలు మాట్లాడేలా చేశామన్నారు.
దేశాన్ని అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మైనార్టీలకు చేసింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రజల డబ్బుతో నిర్మించిన రోడ్లు, విమానాశ్రయాలు తదితరాలకు ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. మైనార్టీల కోసం గళం విప్పేది తామే అన్నారు. మజ్లిస్ ఎవరి వద్ద తలదించుకోదని, ఎంతటి వారైనా తమ వద్ద తలదించుకోవాల్సిందేనని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడాన్ని వ్యతిరేకించే వారిలో తాను ముందు ఉంటాననిచెప్పారు. పాతబస్తీలోని అన్ని స్థానాల్లో మజ్లిస్ గెలుస్తుందని చెప్పారు.