శిథిలావస్తలో చదువుల దేవాలయం.. తమ స్కూలును కాపాడాలంటూ విద్యార్థుల విజ్ఞప్తి
హైదరాబాదు: తెలంగాణలో అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని పాఠశాలల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. పిల్లలు చదువుకోవాలంటే ముందుగా పాఠశాల భవంతి అక్కడి పరిసరాలు వాతావరణం బాగుండాలి. అలా ఉంటే విద్యార్థుల చదువులు సాఫీగా సాగుతాయి. కానీ ములుగు జిల్లాలోని ఓ పాఠశాల విద్యార్థులు మాత్రం స్కూలుకు వచ్చి బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇంతకీ ఆ విద్యార్థులు స్కూలంటే ఎందకు భయపడుతున్నారు...?
ములుగు జిల్లా కడేకల్ గిరిజన తాండలో పాఠశాల
ములుగు జిల్లాలోని కడేకల్ అనే గిరిజన గ్రామంలోని పాఠశాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఏ క్షణమైనా ఆ పాఠశాల భవనం కుప్పకూలే అవకాశం ఉంది. అయినా సరే విద్యార్థులు ఆ తరగతి గదుల్లోనే కూర్చుని భయంతో పాఠాలు వింటున్నారు. అత్యంత ప్రమాదకరమైన జీవితాన్ని ఆ స్కూల్లో గడుపుతున్నారు. 30 ఏళ్ల క్రితం ఈ పాఠశాలను నిర్మించారు. కానీ అధికారుల అలసత్వం నిర్లక్ష్యంతో ఈ పాఠశాల ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. స్కూలు నిర్మాణం జరిగినప్పటి నుంచి భవంతి పాడుబడుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఓ కన్నుకూడా వేయలేదని అక్కడి టీచర్ అతోలు సుమన్ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క మరమత్తు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలో కనీస వసతుల కొరత
ఇక పాఠశాల మౌలిక సదుపాయాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. కనీస వసతులు కూడా కొరవడ్డాయి. తరగతి గదుల్లో బ్లాక్ బోర్డు లేదు, విద్యార్థులు కూర్చొనేందుకు బెంచీలు లేవు. ఇంకా చెప్పాలంటే అవి తరగతి గదులే కావు. ఎందుకంటే వాటికి తలపులు లేవు, కిటికీలు అంతకన్నా లేవు. విద్యార్థులంతా వెరండాలో కూర్చుంటారు. ఆ వెరండా పెచ్చులు కూడా బయటకొచ్చేశాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో విద్యార్థులు వారి చదువును కొనసాగిస్తుండటం చూస్తే మనసు కలిచివేస్తుంది. ఇక ఆ భవంతిని చూస్తే ఒక పాడుబడ్డ బంగ్లా కంటే దారుణంగా ఉంటుంది. మేడారం జాతర సందర్భంగా ఆ ఉత్సవాన్ని కవర్ చేసేందుకు వెళుతున్న మీడియా కెమెరాల కంటికి కడేకల్ పాఠశాల దుస్థితి చిక్కింది.
విద్యాశాఖ మంత్రికి ట్వీట్ చేసిన హెడ్మాస్టర్
ఈ పాఠశాలలో ఒకే ఒక టీచర్ ఉంటాడు. ఇక ఇతనే హెడ్మాస్టర్, ఇతనే ఇతర పనులను చేస్తాడు. అప్పుడప్పుడు ఇద్దరు విద్యావాలంటరీలు సుమన్కు సహాయం చేసేందుకు వస్తారు. నెలరోజుల క్రితమే తాను ఈ పాఠశాలలో హెడ్మాస్టర్ బాధ్యతలు చేపట్టినట్లు చెప్పిన సుమన్ భవంతి పరిస్థితి చూసి షాక్ అయినట్లు వెల్లడించాడు. గ్రామ పంచాయతీ దృష్టికి, ఇతర జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతకుముందున్న హెడ్మాస్టర్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసిందని సుమన్ చెప్పారు. ఈ భవంతి ఏక్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 31 మంది విద్యార్థులున్నారని పాఠశాలను సరిగ్గా మెయిన్టెయిన్ చేయగలిగితే మరింత మంది విద్యార్థులు చేరే ఛాన్స్ ఉంటుందని సుమన్ చెప్పారు. ఇదే విషయాన్ని చెబుతూ సుమన్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు.
ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ఇక కడేకల్ గిరిజన గ్రామంలోని చాలా మంది విద్యార్థులు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డల ప్రాణాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ స్కూలుకు మరమత్తులు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మేడారం జాతర కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ఇలాంటి పాఠశాలలకు మరమత్తులు చేసి లేదా కొత్త భవంతిని కట్టించి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.