కెసిఆర్పై బాబు అలాగే ఫైట్ చేస్తే..: జగన్ వాదనలో నిజం ఉందా?
విజయవాడ: పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల వలసలు, ఎమ్మెల్యే రోజా విషయంలో న్యాయస్థానంలో ఎదురుదెబ్బ, ఎమ్మెల్యేల అనర్హత లక్ష్యం నెరవేరకపోవడం.. ఇలా వరుస దెబ్బలతో వైసిపి అధినేత జగన్ ఆత్మరక్షణలో పడిపోయారు.
అయితే, ప్రత్యేక హోదా, తెలంగాణలో ప్రాజెక్టుల ద్వారా జగన్ ఒక్కసారిగా పుంజుకున్నారు. వీటి విషయంలో చంద్రబాబు పైన జగన్ పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ఈ విషయాల్లో చంద్రబాబును ప్రశ్నించడంలో ముందున్నారు.
తెలంగాణలో ప్రాజెక్టుల విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి ఉమా భారతికి లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతుందని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూసింది.
చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని ఆరోపిస్తూ టిఆర్ఎస్ నేతలు జూలై 11, 2015లో పాలమూరు బంద్కు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఓటుకు నోటు వ్యవహారం వల్లే చంద్రబాబు పాలమూరు, తెలంగాణ ప్రాజెక్టుల పైన నోరు మెదపలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఏడాది క్రితం తెలంగాణ ప్రాజెక్టుల పైన లేఖలు రాసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు మళ్లీ ఎందుకు పట్టించుకోలేదని నిలదీస్తున్నారు. అందుకు ఓటుకు నోటు కారణమని ఆరోపిస్తున్నారు. జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల పైన పోరాడితే... తెలంగాణ సీఎం కెసిఆర్ కృష్ణా, గోదావరి పైన విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టులు కట్టకపోయి ఉండేవారని పలువురు విమర్శిస్తున్నారు. ఓటుకు నోటు కారణంగా చంద్రబాబు మౌనంగా ఉండటం వల్లే కెసిఆర్ విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టుల విషయంలో దూకుడుగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. తమ ప్రాజెక్టులు అన్ని సక్రమమేనని తెలంగాణ చెప్పడం ఇక్కడ వేరే విషయం.
ఓటుకు నోటుకు ముందు తెలంగాణ ప్రాజెక్టుల పైన చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు సంచలనం సృష్టించాయని, ఆ తర్వాత ఆయన మిన్నకుండిన ఫలితమే ఇది అని దుయ్యబడుతున్నారు. చంద్రబాబు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఈ కేసు కోసం పణంగా పెడుతున్నారని జగన్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఓటుకు నోటుకు, తెలంగాణ ప్రాజెక్టులకు లింక్ పెట్టి జగన్.. బాబును కార్నర్ చేశారు.