ఆ మూడు పార్లమెంట్ స్థానాలపై గులాబీ బాస్ గురి ... కారణం ఇదే
Recommended Video
రానున్న లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో టార్గెట్ త్రీ అంటున్నారు గులాబీ బాస్ .. గత ఎన్నికల్లో గులాబీజెండా ఎగరని మల్కాజ్గిరి.. సికింద్రాబాద్ స్థానాలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరో నియోజకవర్గం చేవేళ్ల సీటుపైనా ప్రత్యేకంగా నజర్ పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆ స్థానాన్ని టీఆర్ఎస్ ప్రిస్టేజియస్ ఇష్యూగా తీసుకుంది. అలాగే గత ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకున్న సికిందరాబాద్ స్థానాన్ని , టీడీపీ తన ఖాతాలో వేసుకున్న మల్కాజ్ గిరి స్థానాన్ని దక్కించుకోవాలని గులాబీ బాస్ దృష్టి పెట్టారు .
చేవెళ్ల లోక్ సభపై కన్నేసిని గులాబీ నేతలు..! నాయకుల మద్య నెలకొన్న తీవ్ర పోటీ..!!
చేవెళ్ళపై కేసీఆర్ దృష్టి ... కొండాను దెబ్బ కొట్టేందుకే
గత ఎన్నికల్లో చేవెళ్ళ నుండి టీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. ఇక ఈ దఫా ఈ స్థానాన్ని దక్కించుకుని కొండాకు షాక్ ఇవ్వాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. మొదటినుంచి చేవెళ్ల పార్లమెంట్ బరిలో నిలవాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ భావించారు. మరోవైపు తాండూరు నుంచి పోటీచేసి ఓటమిపాలైన మాజీమంత్రి మహేందర్రెడ్డికి చేవెళ్లలో అవకాశం ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గడ్డం రంజిత్రెడ్డిని చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారంటూ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశంలో సైతం రంజిత్రెడ్డి పేరే ప్రముఖంగా వినిపించింది. ఇక తాజాగా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ ఎస్ లో చేరనున్న నేపధ్యంలో గులాబీ బాస్ ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది.
మల్కాజ్ గిరి పై దృష్టి పెట్టిన కేసీఆర్ .. గతంలో ఈ స్థానం టీడీపీ ఖాతాలో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో కీలక పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి. ఈ స్థానాన్ని గతంలో తెలుగుదేశంపార్టీ కైవసం చేసుకుంది. ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి టీడీపీ పక్షాన గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబీపార్టీ పక్కా వ్యూహంతో ఉంది. అంగబలం- ఆర్థికబలం మెండుగా ఉన్న నేతను ఈ స్థానంలో నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ సన్నాహక సమావేశంలోనూ రాజశేఖర్రెడ్డి హడావిడి కనిపించింది. ఇక పార్టీలో మొదటినుంచి ఉన్న నవీన్రావు కూడా మల్కాజ్గిరి టిక్కెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ అగ్రనేతల అండదండలు ఉండటంతో ఆయనా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ సైతం సికింద్రాబాద్, మల్కాజ్గిరిలలో ఏదో ఒకచోట అవకాశం కల్పించాలంటూ పార్టీ పెద్దలను కోరుతున్నారు. దీంతో ఎవరికి టిక్కెట్ దక్కుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది.
సికింద్రాబాద్ టార్గెట్ ... కమలం సిట్టింగ్ స్థానం కాబట్టే
సికింద్రాబాద్ నియోజకవర్గంపైనా గులాబీ జెండాను ఎగేరవేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ గెలిచింది. అందువల్ల ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్లో టీఆర్ఎస్ పక్షాన బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. అయితే సికింద్రాబాద్ సీటు కోసం పోటీ ఎక్కువగానే ఉంది. జీహెచ్ఎంపీ మేయర్ బొంతు రామ్మెహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఈ టిక్కెట్ను ఆశిస్తున్నారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న దండె విఠల్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని అధినేతను కోరుతున్నారు. 2014లో సనత్నగర్ నుంచి పోటీచేసి దండె విఠల్ ఓటమి పాలయ్యారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి తలసాని పోటీచేశారు. దీంతో కనీసం ఎంపీగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని దండె విఠల్ అభ్యర్థిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవెయ్యాలని భావిస్తున్న టీఆర్ఎస్ ఎవరికి అవకాశం ఇస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి 16 స్థానాలలో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న టీఆర్ఎస్ ఈ మూడు స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.ఎవరికి అవకాశం ఇచ్చినా గెలుపు గురాలకే ఇవ్వాలని కేసీఆర్ ప్లాన్ .. ఈ మూడు స్థానాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన కేసీఆర్ ఈ స్థానాల్లో ప్రత్యర్ధుల ఆట కట్టించే వ్యూహంతో ముందుకు వెళ్లనున్నారు.