ఇది పడగొట్టే సీజన్..! కేసీఆర్ ఫాంహౌస్ కూల్చివేత..!!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆయన పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసి, కొత్త భవనాలు నిర్మించాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇక పనిలో పనిగా మెదక్ జిల్లా గజ్వేల్ దగ్గర ఎర్రవెల్లిలో ఉన్న తన ఫాం హౌస్ ను కూల్చివేసి, కొత్త ఫాం హౌస్ నిర్మించాలని చంద్రశేఖర్ రావు నిర్ణయించారని సమాచారం. సచివాలయానికి, అసెంబ్లీకి శంకుస్థాపన చేయడానికి ముందే చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలో తన కొత్త ఫాం హౌస్ కు శంకుస్థాపన చేశారని తెలుస్తోంది.
ఎర్రవెల్లిలో కొత్త ఫాం హౌస్ కు చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేసారని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఫాం హౌస్ రాత్రి వేళల్లో ఉండడానికి అనుకూలంగా లేదని, కుటుంబం అంతా అక్కడ గడిపే పరిస్థితి కూడా లేదని నూతన నిర్మాణం చేయాలని చంద్రశేఖర్ రావు నిర్ణయించారట. తనకు సమయం దొరికినప్పుడల్లా ఎర్రవెల్లికి వెళ్లి తనకు ఇష్టమైన వ్యవసాయం చేసుకోవాలని ,అలాగే ఎర్రవల్లిలో తన స్థిర నివాసం చేసుకోవాలన్న ఆలోచనలో చంద్రశేఖర్ రావు ఉన్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు వేశారు. సమైఖ్యవాది, విభజనవాదుల సమావేశాన్ని చూస్తే ముచ్చటేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన..చంద్రశేఖర్ రావు తెలంగాణకు ముఖ్యమంత్రా... ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రా ? అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమకు నీళ్లిస్తామంటే ఆంధ్రోళ్లు నీళ్ల దోపీడీ చేస్తున్నారని చంద్రశేఖర్ రావు విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు నీళ్ల తరలింపుకు ఎలా మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రాణహిత పుట్టిన ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఏమయ్యాయన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సమైక్యవాదులతో చర్చలు అంటే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని జీవన్ రెడ్డి చెప్పారు.