తెలంగాణా కరోనా కేసుల లెక్కల్లో రియాలిటీ ఇదే .. ప్రభుత్వ లెక్కల్లో డొల్లతనం !!
కరోనా వైరస్ మహమ్మారిని కంట్రోల్ చేసినట్లుగా తెలంగాణ సర్కార్ తప్పుడు లెక్కలు చూపిస్తోంది.కరోనావైరస్ ను కంట్రోల్ చేయలేక కేసులను దాచి పెడుతూ లెక్కలను తక్కువగా చూపుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో కేవలం 30 శాతం కేసులను మాత్రమే బయటకు వెల్లడిస్తున్నట్లుగా అధికారిక లెక్కలలోనే తెలుస్తుంది. స్టేట్ బులిటెన్ కు , జిల్లాలలో నమోదవుతున్న కేసులకు అసలు పొంతన లేకుండా పోతుంది.
Recommended Video
70 శాతం కేసులు దాచి పెడుతున్న తెలంగాణా సర్కార్
70 శాతం కేసులు దాచి పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనా ను కంట్రోల్ చేసినట్లుగా చెప్పుకోవడం పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో గడిచిన వారం రోజుల్లో 3,548 కేసులు నమోదైనట్టు ఖమ్మం జిల్లా అధికారులు చెబుతుంటే కేవలం 1,003 కేసులు నమోదైనట్టు స్టేట్ బులిటెన్ లో ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్లోనూ ప్రతిరోజూ పదిహేను వందలకు పైగా కేసులు నమోదు అవుతుంటే, 500 లోపే వస్తున్నట్లుగా లెక్కల్లో చూపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో గత వారం మూడు వేల కేసులు నమోదైతే ఒక 1078 కేసులే ప్రకటించారు.
కరోనా లెక్కల్లో రాష్ట్ర గణాంకాలకు , జిల్లాల కేసులకు భారీ వ్యత్యాసం
మంచిర్యాల జిల్లాలో 2,208 కేసులు నమోదు కాగా 575 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇలా ప్రతి చోటా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నా అబ్బే అదేం లేదంటూ తక్కువ కేసులు నమోదు అవుతున్నట్లుగా చూపిస్తూ సెప్టెంబర్ చివరిలోగా తెలంగాణాలో కరోనా కంట్రోల్ అవుతుందని ప్రజలను మభ్యపెడుతున్నారు. విపరీతంగా కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నా లెక్కలు బయటపడకుండా జిల్లాల వారీగా అధికారిక బులిటెన్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్నల్గా ప్రతి జిల్లాలోనూ ఉన్న కరోనా కేసుల లెక్కలు, ప్రభుత్వం అధికారికంగా విడుదల చేస్తున్న స్టేట్ బులిటెన్ లెక్కలు చూస్తే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది.
టెస్టులు తక్కువ .. అయినా కేసులు ఎక్కువ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకుంటే పెద్దఎత్తున టెస్ట్ లు చేసిన దాఖలాలు కూడా లేవు. తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ వైఖరిపై మండి పడిన తర్వాత కాస్త టెస్టులు పెంచినప్పటికీ, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సరిగా టెస్టులు జరగటం లేదనే చెప్పాలి . తక్కువ టెస్టులు చేస్తున్నా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి
ప్రస్తుతం రోజూ 9 వేల మందికి పాజిటివ్ వస్తోందనేది ఒక అంచనా. కానీ 3 వేల కంటే తక్కువ కేసులే నమోదవుతున్నట్టు బులెటిన్లో చూపిస్తున్నారు.
అధికారిక లెక్కలకు నాలుగింతలు ఎక్కువగానే కేసులు
ప్రభుత్వ లెక్కలు సరిగా ఇస్తే దేశంలో తక్కువ టెస్ట్ చేసిన రాష్ట్రంగా, ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో ప్రస్తుతం టెస్ట్ లు చేయించుకున్న ప్రతి 100 మందిలో 20 మందికి పాజిటివ్ వస్తుందని క్షేత్ర స్థాయిలో డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ శాతం ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక గ్రేటర్లో చూసుకుంటే 25 నుంచి 30 శాతం పాజిటివ్ కేసులు ఉన్నట్లుగా భావిస్తున్నారు.
మరణాల లెక్కల్లోనూ అన్నీ తేడాలే ... ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తాయనే లెక్కల జిమ్మిక్కులు
ఇక కరోనా మరణాల్లో కూడా ప్రభుత్వ లెక్కలు తప్పే అన్న వాదన వినిపిస్తుంది . ఒక్క గాంధీ హాస్పిటల్ లోనే రోజుకు 35 మందికి పైగా చనిపోతున్నారని డాక్టర్లు, సిబ్బంది చెబుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో చనిపోతున్న వారికి ఇంకా లెక్కేలేదు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 856 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా, ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుందనేది రియాలిటీ. తెలంగాణ రాష్ట్రంలో భారీగా కేసులు, భారీగానే మరణాలు సంభవిస్తున్నాయి అనేది రాష్ట్ర ఆరోగ్య శాఖ అందిస్తున్న వివరాలు, జిల్లాలోని ఆస్పత్రి లో నమోదు చేస్తున్న వివరాల మధ్య ఉన్న అంతరాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తాయని, తెలంగాణ ప్రభుత్వం కావాలనే కేసులను తక్కువగా చూపిస్తుందని అర్థమవుతుంది.