హుజూర్ నగర్ సభకు కేసీఆర్ వెళ్ళని కారణం ఇదే .. గుట్టు విప్పిన విజయశాంతి
తెలంగాణా రాములమ్మ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తెలంగాణా సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ సభకు వెళ్లకపోవటానికి గల కారణాలు చెప్పారు. సీఎం సభ రద్దు గుట్టు విప్పారు. తెలంగాణా సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ లో చేపట్టిన బహిరంగ సభలో పాల్గోకపోవటమే ఆయన ఓటమికి నాంది అన్నారు విజయ శాంతి. సీఎం కేసీఆర్ పై ఏ మాత్రం ఛాన్స్ దొరికినా సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్న విజయ శాంతి తాజాగా చేసిన పోస్ట్ లో సీఎం కేసీఆర్ సభ రద్దుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణం అని చెప్పారు .
తెలంగాణా సీఎం కేసీఆర్ వాతావరణం అనుకూలించలేదు అన్న సాకుతో హుజూర్నగర్ పర్యటనను వాయిదా వేసుకోవడం వెనక అసలు మతలబు వేరే ఉందన్నారు విజయశాంతి. నిజంగా హుజూర్నగర్లో పర్యటించాలని సీఎం భావించి ఉంటే అందుకు రోడ్డు మార్గం ద్వారానైనా ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ ఆ పని చెయ్యలేదని ఆమె పేర్కొన్నారు. ఇక మొదటి నుండి సీఎం కేసీఆర్ సభకు వస్తారా రారా అన్న సందిగ్ధం నేపధ్యంలో ఆయన సభ క్యాన్సిల్ అయ్యింది.
ఆర్టీసీ సమ్మె సెగ తగులుతుండానే భయంతో కేవలం హెలికాప్టర్ ద్వారానే హుజూర్నగర్కు వెళ్లాలని కెసిఆర్ భావించారని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిరసన సెగ తగులుతుందేమో అనే భయం ఆయనను వెంటాడటమే కారణం అని విజయశాంతి అన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ మంత్రులను కొన్ని ప్రాంతాల్లో అడ్డుకోవడాన్ని చూస్తున్నామన్న రాములమ్మ మంత్రుల పరిస్థితే తనకు కూడా పడుతుందేమో అని కేసీఆర్ వెనుకంజ వేశారని పేర్కొన్నారు.
అంతేకాదు ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపధ్యంలో చేదు అనుభవం ఎదురవుతుందేమో అన్న టెన్షన్ దొరగారికి మొదలైనట్లుంది అని విజయశాంతి వ్యంగ్యంగా మాట్లాడారు . అందుకే కేవలం 200 కిలోమీటర్ల దూరం ఉన్న హుజూర్నగర్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లే సాహసం చేయలేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి చెప్పారు . దొరగారు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించినట్లేనని భావించాల్సి ఉంటుందని ఆమె తేల్చేశారు.