వాటితో పాటే ఇవి కూడా..! స్థానిక సంస్థల ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ..!!
హైదరాబాద్ : ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికలసంఘం రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారుచేసింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘం నుంచి అనుమతి రావడంతో స్థానికసంస్థల ఎన్నికలకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలైన మున్సిపాలిటీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికలసంఘం అనుమతినిచ్చింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనలపై తమకేమీ అభ్యంతరం లేదని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖరాసింది. ఏప్రిల్ 11న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చి 13, 22 తేదీల్లో కేంద్ర ఎన్నికలసంఘానికి లేఖలు రాసింది.
స్థానిక ఎన్నికలకు ఏ విధంగా ఏర్పాట్లు చేయనున్నదీ ఆ లేఖల్లో వివరించింది. అన్నింటినీ పరిశీలించిన కేంద్ర ఎన్నికలసంఘం.. ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత మున్సిపాలిటీలు, మండల, జిల్లా ప్రజాపరిషత్లకు ఎన్నికలు నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. ఫలితాలను మాత్రం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే విడుదలచేయాలని స్పష్టంచేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా లోక్సభ ఎన్నికలపై సిబ్బంది, ఇతర విషయాల్లో ప్రభావం పడకుండా చూసుకోవాలని సీఈవోకు రాసిన లేఖలో ఈసీ సెక్షన్ అధికారి సంజయ్కుమార్ పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ఎన్నికల సంఘం సమాలోచనలు చేస్తున్నదని సమాచారం. వీటిని ఈ నెల 15 నుంచి మే 20 మధ్య ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది.