తెలంగాణకు ఇలా జెల్ల కొట్టిన మోదీ: దత్తన్నకు ప్రత్యామ్నయమెవరు?
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల టీమ్ రూపకల్పనలో భాగంగా ఆదివారం జరిపిన కేబినెట్ విస్తరణలో తెలంగాణకు మొండి చేయి చూపడానికి కారణాలు వేరని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల టీమ్ రూపకల్పనలో భాగంగా ఆదివారం జరిపిన కేబినెట్ విస్తరణలో తెలంగాణకు మొండి చేయి చూపడానికి కారణాలు వేరని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం.. తెలంగాణపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. ఇక్కడ అత్యధిక లోక్సభ స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
అయినా ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్కు ప్రాతినిధ్యం లేకుండా చేయడంపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కార్మికశాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయతో రాజీనామా చేయించడానికి కారణాలు ఏమైనా.. ఈ ప్రభావం పార్టీపై తప్పక ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సంస్థాగతంగా బలోపేతం కావడానికి తెలంగాణలోని ఇతర పార్టీలకు చెందిన బీసీ, రెడ్డి సామాజిక వర్గాల నేతలను ఆకర్షించే ప్రయత్నాలో స్థానిక నేతలు ఉన్నారు.
ఈ దశలో బీసీ వర్గానికి చెందిన దత్తన్నను తప్పించటం ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలను తీసుకెళ్తుందోననే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గమ్మత్తేమిటంటే ఇటీవలే బీసీ కమిషన్కు రాజ్యాంగ సాధికారత కల్పిస్తూ పార్లమెంట్లో ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోదీ సర్కార్ చట్టాన్ని ఆమోదించింది. వారం క్రితమే ఓబీసీ రిజర్వేషన్ల అమలును ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకూ విస్తరించింది. తద్వారా బీజేపీ ఓబీసీలకు వ్యతిరేకం కాదన్న సంకేతాలివ్వబూనుకున్నది.
1993లో డీవోపీటీ ఆదేశాల అమలుకు ఇలా మోదీ సర్కార్
కానీ 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం.. మండల్ కమిషన్ సిఫారసులు అమలుజేయ బూనుకున్నప్పుడు అందుకు వ్యతిరేకంగా ఏబీవీపీ, బీజేవైఎంలతో దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టిన బీజేపీ.. మరోవైపు మండల్ కమిషన్ సిఫారసులకు ప్రత్యామ్నాయంగా కమండల్ నినాదం అందుకున్నది. అప్పుడే బీజేపీ సీనియర్ నేతల లాల్ క్రుష్ణ అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర చేపట్టారు. ఈ రథయాత్రను బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ లో అప్పటి లాలూ ప్రభుత్వం నిలిపేయడంతోపాటు అద్వానీని అరెస్టు చేయడంతో వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలింది. అంతే కాదు నాడు అద్వానీని అరెస్ట్ చేసిన నాటి ఐపీఎస్ అధికారి ఆర్కే సింగ్ ఈనాడు జరిగిన మంత్రివర్గ విస్తరణలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం యాద్రుచ్చికం కాదు.
వెంకయ్య ఎంపీ సీటు కూడా
టీఆర్ఎస్ ఎన్డీయే భాగస్వామి కాకున్నా ప్రధాని మోదీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు అండగా నిలుస్తుండటం వల్లే పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రానికి జెల్ల కొట్టారా? అని కూడా కొందరు కమలనాథులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే రాజస్థాన్ కోటాలో తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం పేరు ఖరారైంది. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాంకు కేబినెట్లో అవకాశం కల్పించాలని తొలుత మోదీ భావించారు. రాజస్థాన్ కోటాలో వెదిరె శ్రీరాంకు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజే కూడా సిఫారసు చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఖాళీ చేసిన రాజ్యసభ స్థానాన్ని వెదిరె శ్రీరాంకు ఇవ్వాలని కూడా కోరారు.
చివరి క్షణంలో మార్పులకు కారణాలివి
తెలంగాణలో శ్రీరాంకు ఇస్తున్నారు కనక ఏపీ నుంచి కంభంపాటి హరిబాబును కూడా ఢిల్లీకి పిలిచారు. కానీ, చివరి నిమిషంలో రాజస్థాన్ నుంచి గజేంద్ర షెకావత్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల అక్కడ రాజ్పుత్ వర్గానికి చెందిన గ్యాంగ్స్టర్ ఆనంద్పాల్ను ఆ రాష్ట్ర పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. బీజేపీ పట్ల గుర్రుగా ఉన్న రాజ్పుత్రులను శాంతింపజేయడానికి ఆయనకు పదవి కట్టబెట్టారు. కనక శ్రీరాం పేరును పరిగణనలోకి తీసుకోలేదు. వెదిరె శ్రీరాంకు చోటు కల్పించకుండా హరిబాబుకు క్యాబినెట్ హోదా కల్పిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న అనుమానంతోనే హరిబాబును కూడా పెండింగ్లో పెట్టాల్సి వచ్చింది. అయితే, మరో విస్తరణ ఉంటుందని, మిత్రపక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకేలకు అవకాశం కల్పిస్తారని, ఆ సమయంలో వీరిద్దరికీ చాన్సు ఉంటుందని బీజేపీ నేతలు ఊరడిస్తున్నారు.
తప్పుడు సంకేతాలు వెళతాయనే ఇలా వెనుకడుగు
అంతకు ముందు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు హుటాహుటిన కుటుంబ సమేతంగా హస్తినకు బయలుదేరి వెళ్లారు. కానీ, చివరి నిమిషంలో సమీకరణాల్లో జరిగిన మార్పుల కారణంగా ఆయనను పెండింగ్లో పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. నిజానికి, తెలంగాణకు చెందిన దత్తాత్రేయను తొలగించి, అక్కడి నుంచి ఎవరికీ అవకాశమివ్వకుండా ఏపీ నుంచి హరిబాబుకు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్ఠానం భావించింది. అందువల్లే తెలంగాణలో వెదిరె శ్రీరాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంభంపాటి హరిబాబు అవకాశం మిస్సయిందని చెప్తున్నారు.