దేశంలోనే ఫస్ట్: తెలంగాణ మహిళల ఆధ్వర్యంలోని ఈ రేడియో మూగబోనుంది
హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ మహిళల సంఘమ్ రేడియా ఇండియాలో తొలి కమ్యూనిటీ రేడియో. అయితే, నిధుల కొరత కారణంగా ఇది మూతబడుతోంది. ఈ రేడియోను డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్), ఓ ఎన్జీవో కలిసి నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇది నడవాలంటే ఫండ్స్ అవసరం.
ఈ రేడియో నడవాలంటే ఇప్పుడు రూ.10 లక్షలు అవసరమని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తెలిపింది. పాత పరికరాల స్థానంలో ఆధునాతన పరికరాలు తెచ్చేందుకు, అప్డేట్ టెక్నాలజీ కోసం, అలాగే, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు ఆ మొత్తం అవసరముందని చెప్పారు.
బలహీన వర్గాల గ్రామీణ కమ్యూనిటీకి ఇది తొలి రేడియో. ఇందులో 11 మంది జర్నలిస్టులు, ఇద్దరు రేడియో ప్రోగ్రామర్లు ఉన్నారు. 2008లో దీనిని ప్రారంభించారు. అంతకుముందు చాలా ఏళ్ల ముందే ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందింది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం మంచూర్ గ్రామం నుంచి ప్రారంభించారు.
గ్రామంలోని ప్రతి ఒక్కరి నుంచి రూ.50 తీసుకోవడంతో పాటు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా దీనిని నడిపించారు. కానీ ఇప్పుడు నిధులు అంతగా రావడం లేదని చెబుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల 25వేల ప్రకటనల ఖర్చు రావాల్సి ఉందని డీడీఎస్ కోఆర్డీనేటర్ కృష్ణవేణి చెప్పారు.
ఉద్యోగులకు వేతనాలు కూడా కష్టంగా మారాయన్నారు. కమ్యూనిటీ రేడియోకు అంతర్జాతీయ నిధుల విషయంలో మన నిబంధనలు అడ్డుగా వస్తున్నాయని, అలాగే, స్థానిక ప్రకటనదారులు ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు.
యునెస్కో ట్రాన్స్మిట్టర్ను విరాళంగా ఇచ్చిందని, దానిని స్థానికుల విరాళాలతో తీసుకు వచ్చామని, చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో చేసుకోవాల్సిన బ్రాడ్కాస్టింగ్ కేవలం 3 కిలోమీటర్లకే పరిమితమైందన్నారు. త్వరలో ఇది కూడా మూగబోనుందని చెప్పారు.
సంఘం రేడియో ప్రొడ్యూసర్ నర్సమ్మ మాట్లాడుతూ.. ట్రాన్స్మిట్టర్ను రీప్లేస్ చేయాల్సి ఉందని చెప్పారు. ప్రసారాలపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తమ చుట్టూ ఉన్న 50 గ్రామాలు ఈ రేడియో స్టేషన్ పరిధిలో ఉంటాయన్నారు.
తాము వ్యవసాయం, విద్య పైన దృష్టి సారిస్తామని, తమ ఛానల్లో చాలామంది వింటారని, తమ వద్ద 11 మంది రిపోర్టర్లు ఉన్నారని ఆమె తెలిపారు. వారు ప్రతి గ్రామంలోకి వెళ్లి, లోతుగా తెలుసుకొని రిపోర్టింగ్ చేస్తారని తెలిపారు. వారి సమస్యలను చర్చిస్తారన్నారు. మా రేడియో ఎంతోమందికి ఉపయోగపడుతుందని, ఇది నడవాల్సి ఉందన్నారు.
సంఘం రేడియోకు 1998లో అంకురార్పణ జరగగా, 2008 నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. కమ్యూనిటీ రేడియోకు ప్రభుత్వం నో చెప్పినా, ఆ తర్వాత 2008 అక్టోబర్లో అనుమతులు వచ్చాయి. ఈ రేడియో నడిపేందుకు మిలాప్ ద్వారా నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిలాప్ (MILAAP) ద్వారా ఎవరైనా ఈ రేడియో కోసం విరాళంగా ఇవ్వవచ్చు. పేటీఎం ద్వారా కూడా విరాళం ఇవ్వవచ్చు. ఇప్పటికే పలువురి నుంచి స్పందన కనిపిస్తోంది.