తెలంగాణలో అదికార పార్టీకి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలే టార్గెట్...
తెలంగాణ రాజకీయాల్లో ఆదిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మద్య ప్రఛ్చన్న యుద్దం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తుంటే, 2019లో అధికార పార్టీని ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ క్రుతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే ఒక పార్టీపై మరొక పార్టీ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అలాగే ఆయా పార్టీలో ఉండే బలమైన నేతలకు ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ఇరుపార్టీలు. కాగా ఇదే అంశంలో టీఆర్ఎస్ పార్టీ ముందు వరసలో దూసుకుపోతోంది. కాంగ్రెస్లో ఉన్న ప్రధాన నేతలనీ టార్గెట్ చేసుకుని వారి గెలుపుని నిలువరించాలని స్కెచ్ వేస్తోంది. అదికార పార్టీకి కొరకరాని కొయ్య గా తయారైన ఆ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలే లక్ష్యంగా పావులు కదుపుతోంది గులాబీ పార్టీ. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు., ఏంటా కథ.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తెలంగాణాలో అభ్యర్థుల బలాబలాలపై మొదలైన చర్చ..
ఫైర్ బ్రాండ్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, నల్గొండ జిల్లాలో గట్టి పట్టున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ పేర్లు టీఆర్ఎస్ హిట్ లిస్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్టీ సీనియర్లతో టీఆర్ఎస్ అధినాయకత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరి నియోజకవర్గాలను చేజిక్కించుకోవడం ద్వారా రాజకీయంగా భవిష్యత్తులో తమకు తిరుగుండదని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు ప్రయత్నిస్తున్న వీరిని...సొంత నియోజకవర్గాల్లోనే దెబ్బతీయాలని అదికార పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఆ మూడు నియోజకవర్గాల పై ప్రత్యేక నజర్..
గద్వాల, కొడంగల్, నల్లగొండ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దిమ్మదిరిగే సమాదానం చెప్పాలని అదికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో మొదటిగా అదికార పార్టీ కంటిలో నలుసులా పరిణమించిన రేవంత్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేశారు. నిత్యం విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న రేవంత్ను కట్డడి చేసేందుకు సొంత నియోజకవర్గంలోనే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తద్వారా ఆయన నియోజకవర్గంలో పట్టుసాధిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తోంది టీఆర్ఎస్.
ధీటైన అభ్యర్థులకోసం వేట.. టార్గెట్ మిస్సవ్వొద్దంటున్న గులాబీ బాస్...
ఎన్నికల సమయంలో రేవంత్ బయటకు వెళ్లి ప్రచారం చేసే పరిస్థితి లేకుండా స్థానికంగానే ఉక్కిరిబిక్కిరి చేయాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కోడంగల్లో రేవంత్రెడ్డిని ఢీ కొట్టాలంటే అంగ, అర్థబలం ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్రెడ్డినే బరిలో దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావించి అందుకు తగ్గట్టు ప్రణాళిక రచిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి.
Recommended Video
ఆ ముగ్గురిని ఇంటికి పింపిస్తే ఎదురే ఉండదన్నది టీఆర్ఎస్ ప్లాన్..
గులాబీ ప్రభుత్వానికి తరచుగా సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డిని కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తరిమేయాలని పన్నాగం పన్నుతున్నారు. అందులో భాగంగా కోమటిరెడ్డిపై బలమైన ప్రత్యర్థిని బరిలోకి దించి ప్రయోజనం పొందాలని అదికార పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ ప్రజలు జేజేమ్మగా పిలుచుకునే డాషింగ్ వుమెన్ డీకె అరుణ గురించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. గద్వాల నియోజకవర్గంలో అన్ని రకాలుగా బలంగా ఉన్న డీకే అరుణపై పోటీలో నిలపడానికి అంగబలం, అర్థబలం కలిగి, అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడి కోసం టీఆర్ఎస్ అధిష్టానం వెతుకుతుందట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్వాల కోట నుండి డీకే అరుణకు ఉద్వాసన పలకాలని అదికార పార్టీ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా తెలంగాణాలో ఈ ముగ్గురి కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోందట. మరి ఈ ముగ్గురుకి గులాబీ నాయకత్వం చెక్ పెడుతుందా లేక చెక్ పెట్టించుకుంటుందా చూడాలి.