బయటపడ్డ లింకులు: వాళ్లిద్దరికీ హైదరాబాద్లో ఆశ్రయం, వెలుగులోకి ఆసక్తికర 'టెర్రర్' కథనం..
హైదరాబాద్: ఇటీవల పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఉగ్రవాదులకు హైదరాబాద్ తో లింకులు బయటపడ్డాయి.
గత నెల 24న కోల్కతాలో ఎస్టీఎఫ్ అరెస్టు చేసిన ఇద్దరు బంగ్లాదేశీయులు హైదరాబాద్ శివార్లలో కొన్ని రోజుల పాటు ఆవాసం పొందినట్లు గుర్తించారు. అలాగే ఎన్ఐఏ అరెస్ట్ చేసిన లష్కరేతొయిబా ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం నార్త్జోన్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నాడు.
అల్సారుల్లా ఉగ్రవాదులు:
బంగ్లాదేశ్ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ అల్సారుల్లా బంగ్లా టీమ్కు (ఏబీటీ) చెందిన ఇద్దరు ఉగ్రవాదులు షంషద్ మియా అలియాస్ తన్వీర్, షుపూన్ బిస్వాల్ అలియాస్ తమిన్లను ఎస్టీఎఫ్ పోలీసులు గత నెల 24న అరెస్ట్ చేశారు. కోల్కతా రైల్వే స్టేషన్లోనే వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఏజెన్సీలకు వీరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు.
హైదరాబాద్లో ఆశ్రయం:
షంషద్, షుపూన్ అక్టోబర్ 1న అక్రమంగా బంగ్లా సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించారు. ఆపై హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నగర శివారులో నివాసముంటున్న బంగ్లాదేశీ రియాజుల్ ఇస్లాంను కలిశారు. స్థానికంగా ఓ మటన్ షాపులో పనిచేస్తున్న రియాజుల్.. వీరికి ఆశ్రయం కల్పించాడు. వీరితో కలిసి పలు ప్రాంతాలు కూడా సందర్శించాడు.
బోగస్ ఆధార్:
షంషద్కు బోగస్ ఆధార్ కార్డు ఇప్పించడంలోను రియాజుల్ సహకరించాడు. ఇదే క్రమంలో దేశ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫుపూన్ బిస్వాస్ గత నెల రెండో వారంలో చాకచక్యంగా సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ వెళ్లిపోగా.. షంషద్, రియాజుల్ మాత్రం పట్టుబడ్డారు.
ఫుపూన్ వీళ్ల కంటే ముందే వెళ్లిపోగా.. ఆ ప్రయత్నాల్లో ఉన్న వీరిద్దరు హౌరా ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేశారు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ అధికారులు వీరిని అక్కడి రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద దొరికిన కొన్ని పత్రాల ఆధారంగా హైదరాబాద్ తో లింకులు బయటపడ్డాయి.
దీంతో ఇక్కడి నుంచి ప్రత్యేక బృందాన్ని కోల్కతా పంపి నగరంలో ఈ ముగ్గురి కార్యకలాపాలపై ఆరా తీశాయి. వీరిద్దరు నగర శివార్లలో ఆశ్రయం పొందినట్లు తేల్చారు. ఇక్కడ ఉన్న సమయంలో ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడలేదని నిర్దారించారు.
లక్నోలో ఎల్ఈటీ ఉగ్రవాది:
గత మంగళవారం లక్నోలోని చార్భాగ్ బస్టాండ్లో లష్కరేతోయిబాకు (ఎల్ఈటీ) చెందిన ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ నయ్యూను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. షేక్ అబ్దుల్ నయీంను మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
2007 మార్చిలో అక్రమంగా బంగ్లాదేశ్ సరిహద్దులు దాటుతుండగా బీఎస్ఎఫ్ అధికారులు వెస్ట్ బెంగాల్లో పట్టుకున్నారు.
ఏంటా కోడ్:
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు షేక్ అబ్దుల్ నయీం మరో ఐదుగురితో కలిసి ఆపరేషన్ 'మాద్రా' కోసం వస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఈ 'మాద్రా' ఆపరేషన్ ను అధికారులు ఇంతవరకు డీకోడ్ చేయలేకపోయారు. షేక్ అబ్దుల్ నయీం పట్టుబడిన ఏడాదే హైదరాబాద్ మక్కా మసీదు పేలుడు జరిగింది. పేలుళ్లలో షేక్ అబ్దుల్ నయీం పాత్రపై అనుమానాలు తలెత్తాయి. దీంతో రాష్ట్ర పోలీసులు ముంబై వెళ్లి నిందితుడిని ఇక్కడికి తీసుకొచ్చి విచారించారు.
చివరికిలా చిక్కాడు:
రాష్ట్ర పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సమయంలో షేక్ అబ్దుల్ నయీం 2007 జూన్ 18న మహంకాళి పోలీసుస్టేషన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. ఆ తర్వాత కోల్కతా పోలీసులు 2014 సెప్టెంబర్ 24న ముంబై కోర్టులో హాజరుపరిచారు. అనంతరం హౌరా-ముంబై ఎక్స్ప్రెస్లో కోల్కతాకు తరలిస్తుండగా.. ఖర్సియా-శక్తి రైల్వే స్టేషన్ల మధ్య తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు పోలీసులు కోల్ కతాలోనే పట్టుకోగలిగారు.