మాస్కులు పెట్టుకోని వారు చెల్లించారు భారీ మూల్యం..తెలంగాణలో రికార్డు స్థాయిలో జరిమానాలు.!
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. కోవిడ్ నియమాలను బేఖాతరు చేసిన వారిని కొట్టకుండా, తిట్టకుండా చాలా కూల్ గా హాండిల్ చేసారు తెలంగాణ పోలీసులు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్దంగా వ్యవహరించిన వారి నడ్డి విరిచింది పోలీసు శాఖ. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవమరించిన వారికి జరిమానా రూపంలో అతిపెద్ద శిక్షను అమలు చేసారు పోలీసులు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారంతా భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
నిర్లక్ష్యం వద్దు.. ప్రజలు బాద్యతగా వ్యవహరించాలన్న పోలీస్ బాస్..
చెప్పింది వినక పోతే చెడెదవురా అనే సామెత ఇప్పుడు అక్షరాలా వాస్తవ రూపం దాల్చింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు పాటించకపోతే తప్పదు భారీ మూల్యం అనే దిశగా పోలీసులు ఆచరించి చూపించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగని పోరాటం చేస్తుంటే, ప్రభుత్వాలకు సహకరించాల్సిందిపోయి నిబందనలు ఉల్లంఘిస్తామంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు కదా. తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది. కరోనా లాక్డౌన్ ఆంక్షలను పటించండి, కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండండి, పోలీసులకు సహకరించండి అని మైకు పట్టుకుని మొత్తుకున్న కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
లాక్డౌన్ పరిస్థితులను కోర్టుకు వివరించిన డిజీపి.. సంతృప్తి వ్యక్తం చేసిన కోర్ట్..
ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సోమవారం విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరయ్యారు. అలాగే, తెలంగాణలో లాక్డౌన్, కరోనా నిబంధనలపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిజిపి స్పష్టం చేసారు. బ్లాక్ మార్కెట్లో ఔషధల అమ్మకాన్ని నిరోధిస్తున్నామని, ఇప్పటికి 98 కేసులు నమోదు చేశామని వివరించారు.లాక్డౌన్ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మాస్కులు లేని వారికి భారీ జరిమానా.. ఫైన్ రూపంలో 31 కోట్లు వసూలు చేశామన్న డీజీపీ..
ఈ నెల 1 నుంచి 14 వరకు నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశామని చెప్పారు. మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసులు నమోదు చేశామని, మొత్తం 31 కోట్ల రూపాయల జరిమానా విధించామని చెప్పారు. అలాగే, భౌతిక దూరం పాటించనందుకు నమోదయిన మొత్తం కేసులు 22,560 అని వివరించారు. కాగా, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధులు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని సూచించింది.
మహమ్మారిని తరిమి కొట్టాలి.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్..
అందరి మంచి కోసమే లాక్ డౌన్ విధించామని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సెకండ్ వేవ్ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 5 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. సోమవారం కమిషనరేట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో సజ్జనార్ పర్యటించారు. రోడ్లపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు. వాహనాల కదలికలను వ్యక్తిగతంగా సమీక్షించారు. రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సజ్జనార్ సూచించారు.