ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునేవాళ్లు...ఇవి తెలుసుకోవాల్సిందే!
హైదరాబాద్:చిన్నప్పుడు బాలల దినోత్సవం వంటి సందర్భాల్లో స్కూళ్లల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించడం కద్దు. అలాంటి తరుణంలో వ్యాసరచన, వక్తుత్వ పోటీల సందర్భంగా నేనే ప్రధాని అయితే, నేనే ముఖ్యమంత్రి అయితే, నేనే ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారో తెలపమనే టాపిక్ లు ఇచ్చేవారు.
సాధారణంగా చాలా మందికి అలా విద్యార్థి దశలో ఈ పాలనా వ్యవస్థ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, అవకాశం లభిస్తాయి. అలాంటి సందర్భాల్లో నిజంగానే తాము అలా అవ్వాలని చిన్ననాటి నుంచి కోరుకునేవారు కూడా ఉండటంలో ఆశ్చర్యం లేదు. అతి త్వరలో తెలంగాణాలో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అవాలంటే తెలుసుకోవాల్సిన అంశాలు మీకోసం...
ఈసారి...మరింత కచ్చితంగా
కాలక్రమంలో మార్పులు, పెరిగిన సాంకేతికతల సహాయంతో వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే నిబంధనలను మరింత కచ్చితంగా,కఠినంగా అమలు చేయాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు చిన్న పొరపాట్ల విషయంలోనూ ఉపేక్షించడం ఉండదని...చర్యలు తప్పవని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అతి త్వరలో తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ సూచిస్తున్న మార్గదర్శకాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
నియమ నిబంధనలు...తెలుసుకోవాలి
ముందుగా అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించి న్యాయ నిబంధనలు, ఎన్నికల కమిషన్ నియమాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి...పోటీ చేయడానికి ముందే శాసనసభ ఓటర్ల తుది జాబితాల్లో పేరును తనిఖీ చేసుకోవాలి. పేర్లు, చిరునామా తదిదర వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి. తాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులో కాదో నిర్థారించుకోవాలి. నామినేషన్ ఫారం నిర్ణీత నమూనా ప్రకారం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.
ఇవి చేయాలి...ఇలా చేయాలి
పోటీ చేసే అభ్యర్థి భారతదేశానికి చెందిన పౌరుడై, 25 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. నేరచరిత్ర కలిగి ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగులైతే ఉద్యోగానికి తప్పనిసరిగా రాజీనామా చేసి ఆ తరువాతే పోటీ చేయాలి. నామినేషన్ పత్రంతో పాటు ఆస్తిపాస్తులపై అఫిడవిట్ కూడా సమర్పించాలి. పోటీ చేసే అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని బలపరిచే వ్యక్తి...అభ్యర్థి పోటీ చేయబోయే నియోజకవర్గంలోని ఓటరై ఉండితీరాలి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ పత్రాలు సమర్పించాలనుకుంటే అలా బలపరిచే, ప్రతిపాదించే వారు వేర్వేరుగా ఉండాలి. దాఖలు చేసిన నామినేషన్ పత్రాలకు రశీదు పొందాలి.
ఇవన్నీ...చెక్ చేసుకోవాలి
నామినేషన్ ఒకే అయ్యాక చెల్లుబడి అయిన నామినేషన్ జాబితాల్లో మీ పేరు ఉందో, లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ధృవీకరించుకోవాలి. అలాగే పేరు, వివరాలు తప్పులు లేకుండా సక్రమంగా నమోదయ్యాయో లేవో తనిఖీ చేసుకోవాలి. ఎన్నికల ఏజెంటును సకాలంలో సరైన పద్దతిలో నియమించుకోవాలి. పోలింగ్ స్టేషన్ జాబితాను సేకరించుకోవాలి. ప్రతి పోలింగ్ సెంటర్ లో ఏజెంట్లను సకాలంలో ఏర్పాటుచేసుకోవాలి. అలాగే ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరు ఏజెంట్లను కూడా నియమించుకోవాలి. అలాగే లెక్కింపు ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి.
అంతా పక్కాగా...తేడా రాకూడదు
నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే తేదీ వరకు మీ ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం నియమించిన ప్రతినిధులకు తప్పనిసరిగా అందచేయాలి. వ్యయానికి సంబందించిన వివరాలు, వాటి బిల్లులు,రశీదులు రిజిస్టర్లో రాసుకోవడం, భద్ర పరుచుకోవడం చేయాలి. నామినేషన్ పత్రాన్ని నిర్ణయించిన నిర్థిష్ట వేళకు సమర్పించాలి...ముందుగా గాని, ఆలస్యంగా గాని సమర్పించరాదు. అలాగే నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి, ఆ అధికారం కలిగిన ఉద్యోగికే తప్ప ఇతరులకు సమర్పించకూడదు.
మనీ డిపాజిట్...ఇలా
అవసరమైన డబ్బును డిపాజిట్ చేయడం తప్పనిసరి. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జనరల్ అభ్యర్థి రూ.10,000/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5000/- డిపాజిట్ చేయాలి. ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేసే విషయంలో ప్రలోభాలు, అడ్డకోవడం లాంటివి చేయరాదు. మతం, జాతి, కులం, వర్గం, భాష ల ప్రాతిపదికగా ఓట్లు అడగరాదు. అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా మతపరమైన చిహ్నాలు, జాతీయ చిహ్నాలు గాని ఉపయోగించరాదు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ కేంద్రాల నుంచి కోరిన ప్రాంతాలకు తరలించడానికి వాహనాలను సమకూర్చరాదు. ఎన్నికల కమిషన్ గరిష్ఠంగా నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయరాదు.
గొడవలు చేస్తే అంతే...లెక్కలు సమర్పించండి
ప్రభుత్వ ఉద్యోగుల మద్ధతు పొందే ప్రయత్నం చేయకూడదు. పోలింగ్ కేంద్రం వద్ద దౌర్జన్యాలు, తప్పుడు ప్రవర్తనలకు పాల్పడరాదు. ఎన్నికల సభలు,సమావేశాల సందర్భంగా అల్లర్లు, గొడవలు సృష్టించరాదు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల ప్రచారం చేయకూడదు. ఎన్నికల అధికారి అనుమతి ఇచ్చిన జాబితాలు, నోటీసులు, దస్తావేజులు, నామినేషన్ పత్రాలుకు మరి కొన్నింటిని జత చేయడం, తొలగించడం చేయరాదు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల లోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను సమర్పించాలి.