పుర సమరంలో గులాబీ గుబాళించినా...ఆ ఏడుగురు మంత్రులకు ఇబ్బందులు తప్పవా?
హైదరాబాదు: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో కారు జోరే ఎక్కువగా కనిపిస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కకపోతే మంత్రులపై చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ గుబాళించినప్పటికీ ఓ ఏడుగురు మంత్రులకు మాత్రం ఇబ్బంది తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోకపోతే ఆయా జిల్లాలకు చెందిన మంత్రులపై వేటు తప్పదని సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు హెచ్చరించారు. ఇక పోలింగ్ ట్రెండ్ను పరిశీలించిన టీఆర్ఎస్ నేతలు ఆయా జిల్లాల్లో తమ అభ్యర్థుల ప్రదర్శనను విశ్లేషించారు. ఈ సందర్భంగా ఏడుగురు మంత్రులు ఇబ్బందుల్లో పడబోతున్నారని వార్త షికారు చేస్తోంది. ఇందులో సీఎం కేసీఆర్కు సన్నిహితులు కూడా ఉన్నట్లు సమాచారం.
సొంత మున్సిపాలిటీల్లో మెజార్టీ వార్డులు దక్కించుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. అయితే జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలోని వార్డుల్లో మెజార్టీ దక్కే అవకాశం లేదు. ఇక్కడే మంత్రులు చిక్కుల్లో పడుతున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్పర్సన్ పోస్టు ఎన్నిక సమయంలో పార్టీ ఒక్కింత కష్టపడాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వం నామినేట్ చేసే ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మెన్ పోస్టును దక్కించుకుంటుంది.
ఎన్నికల ట్రెండ్ను చూస్తే టీఆర్ఎస్ అన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లను గెల్చుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా వెనకబడి ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లు, బీజేపీ నాలుగు సీట్లు గెలిచినంత మాత్రానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ హవా కొనసాగుతుందని అనుకోవడం పొరపాటే అవుతుందని ఆయన అన్నారు. అంతేకాదు లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలకు వచ్చిన ఓటు షేరును నిలుపుకోవడం కష్టమే అవతుందన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రదర్శన మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగ్గా ఉంటుందన్నారు.