సబర్వాల్కు అప్పుడే బెదిరింపులు.. 'వెనక్కి తగ్గకపోతే మీ పిల్లలను..'
"విచారణను వెంటనే నిలిపివేయాలి.. లేకపోతే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో నాకు తెలుసున్నది గుర్తుంచుకో" అంటూ సదరు వ్యక్తి సబర్వాల్ ను హెచ్చరించినట్లు సమాచారం.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రెటీలను వణికిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు అప్పుడే బెదిరింపులు మొదలయ్యాయి. తీగ లాగుతుంటే డొంక కదులుతుండటంతో.. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నవారి గుండెలు అదిరిపడుతున్నాయి.
విచారణను సబర్వాల్ సీరియస్గా తీసుకోవడంతో ఇక తమ ఆటలు సాగవేమోనన్న భయంలో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సబర్వాల్ ఫోన్కు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10రోజుల క్రితం ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఆఫ్రికన్ యాసలో ఆయన్ను బెదిరించారు.
"విచారణను వెంటనే నిలిపివేయాలి.. లేకపోతే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో నాకు తెలుసున్నది గుర్తుంచుకో" అంటూ సదరు వ్యక్తి సబర్వాల్ ను హెచ్చరించినట్లు సమాచారం. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ డ్రగ్స్ వ్యవహారంలో అంతర్జాతీయ ముఠాల హస్తం ఉందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
ఇది కేవలం హైదరాబాద్ కే పరిమితమైన వ్యవహారం కాదని, అంతర్జాతీయ స్థాయి నెట్ వర్క్ దీని వెనకాల పనిచేస్తుందని ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కెల్విన్ ద్వారా ఈ అంతర్జాతీయ ముఠాలు హైదరాబాద్ లో డ్రగ్స్ దందా విస్తరించినట్లు చెబుతున్నారు. నెదర్లాండ్, యూరప్ వంటి దేశాల నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి ఎవరా? అన్నది తెలుసుకోవడానికి పోలీసులు వారం రోజులుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
మొత్తం మీద డ్రగ్స్ కేసును విచారిస్తున్న సబర్వాల్ తమ పాలిట యముడు అని ఇందులో సూత్రధారులు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆ భయంతోనే ఆయన్ను బెదిరింపులకు గురిచేసి కేసు నుంచి పక్కకు తప్పించాలన్న కుట్రలు పన్నుతున్నారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న సబర్వాల్ నే నిందితులు టార్గెట్ చేశారంటే.. డ్రగ్స్ వ్యవహారం మున్ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ వెంటాడుతోంది.