చంపేస్తామని మాజీ ఎంపికి బెదిరింపు కాల్స్
హైదరాబాద్: కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచరాం. ఈ మేరకు హైదరాబాదులోని హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ గత నెల 31వ తేదీన హుస్సైన్ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా, వద్దా అనే సందేహాన్ని తీర్చుకోవాడనికి పోలీసులు నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ను ఆశ్రయించారు.
కేసు నమోదు చేయాలని కోర్టు ఈ నెల 5వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఐపిసి సెక్షన్ 507 కింద కేసు నమోదు చేశారు. ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది తేల్చడానికి పోలీసులు విచారణ చేపట్టారు.
అంజన్ కుమార్ యాదవ్ ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయపై ఓడిపోయారు.