ఏపి, టి సిఎంలతోపాటు ‘షార్’కు బెదిరింపు లేఖ: నిర్మల్లో అనుమానితుడి అరెస్ట్
ఆదిలాబాద్/హైదరాబాద్: ఉగ్రవాదులతో చేసుకొన్న ఒప్పందంలో భాగంగా విశాఖపట్నం, గన్నవరం విమానాశ్రయాలు, షార్ రాకెట్ కేంద్రాన్ని పేల్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఓ వ్యక్తి పేరుతో వచ్చిన లేఖకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రాకేశ్ సింగ్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఆ బెదిరింపు లేఖలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా లక్ష్యంగా చేసుకొన్నట్లు పేర్కొనటంతో రెండు రాష్ట్రాల పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఈ లేఖపైన ‘నారాయణ్సింగ్, ఆదిలాబాద్' అని ఉండటంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులు ఉన్నారనే అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఏడాది ఆగస్టులో నిర్మల్ కోర్టుకు వచ్చిన బెదిరింపులేఖలోనూ నారాయణ్సింగ్, షకీర్ అనే ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఈ రెండు లేఖల్లో నారాయణ్సింగ్ పేరు ఉండటంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా, నిర్మల్కుచెందిన నారాయణ్సింగ్, రతన్సింగ్లు అన్నదమ్ములు. రతన్సింగ్కు.. రాకేశ్ సింగ్, రాజేశ్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. నారాయణ్, రతన్సింగ్ల మధ్యన ఇంటి స్థలం విషయంలో వివాదం కొనసాగుతోంది.
ఈ ఏడాది ఆగస్టులో నిర్మల్ కోర్టులో బాంబుపెట్టినట్లు వచ్చిన బెదిరింపు లేఖలో నారాయణసింగ్, ఆయన స్నేహితుడు షకీర్ పేర్లున్నాయి. కాగా, షకీర్ మున్సిపాలిటీలో ఒప్పంద కార్మికుడు. పోలీసులు తమ విచారణలో ఆస్తి తగాదాల దృష్ట్యా రతన్సింగ్ కుమారులే ఇలా రాసి ఉంటారని భావించారు. అప్పటి నుంచి రాకేశ్సింగ్ పరారీలో ఉన్నాడు.
తాజాగా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రాన్ని పేల్చివేస్తామంటూ ఉగ్రవాదుల పేరిట వచ్చిన బెదిదింపు లేఖలోనూ నారాయణ్సింగ్, ఆదిలాబాద్ అని రాసి ఉండటంతో నిఘా వర్గాలు ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాయి.
నిర్మల్ కోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు లేఖలో అనుమానితుడిగా ఉన్న రాకేశ్సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, దీనిని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.