నయీం డెన్లో మూడు బస్తాల ఫొటోలు: నేతలకూ అధికారులకూ ఉచ్చు?
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీం డెన్ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మూడు బస్తాల నిండా ఫొటోలను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ఫొటోల్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నవారితో పాటు ఐపిఎస్ అధికారులు, కానిస్టేబుళ్లు, తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.
దాంతో ఎవరెవరికి ఉచ్చు బిగిస్తుందనే విషయంపై ఉత్కంఠ చోటు చేసుకుంది. నయీంతో సంబంధాలు పెట్టుకున్నవారికి ఉచ్చు బిగించేందుకు సిట్ తన దర్యాప్తును చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా తగిన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.
నయీం డెన్లో లభ్యమైన ఫొటోలను దర్యాప్తు అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నయీంతో సంబంధాలపై, ఫొటోలపై స్పష్టత కోసం అతని కుటుంబ సభ్యులను, అతని అనుచరులను విచారించేందుకు వారిని కస్టడీకి తీసుకుంది.
యీం భార్య హసీనా, సోదరి సలీమా, మేనల్లుడు ఫయీమ్, వంట మనిషి ఫర్హానా, ముఖ్య అనుచరుడు టెక్ మధు తదితరులను సిట్ తన కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటి వరకు తమకు లభించిన ఆధారాలను వారి ముందు పెట్టి వారిని విచారించే అవకాశం ఉంది.
తన వద్దకు వచ్చిన ప్రతి ముఖ్యమైన వ్యక్తి ఫొటోను నయీం వారికి తెలియకుండా తీసి, జాగ్రత్త చేసిన విషయం తెలిసిందే. ఇలా అర డజను మంది పోలీసు ఉన్నతాధికారులు, పదుల సంఖ్యలో డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సిసీ కెమెరాల్లో రికార్డయిని దృశ్యాలను నయీం భద్రపరిచాడు.
కొన్ని సందర్భాల్లో నయీం కొంత మంది అధికారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడాడు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా లభ్యం కావడం నివ్వెరపరుస్తోంది. అవి వాస్తవమైనవేనా, మార్ఫింగ్ చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు అధికారులు పరిశీలన జరుపుతున్నారు.