సునాయాస సంపాదనే లక్ష్యం: ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్(ఫొటోలు)
హైదరాబాద్: సునాయాసంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్స్నాచర్లుగా మారిన ముగ్గురు యువకులను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గురువారం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు.
గోషామహల్ హిందీనగర్కు చెందిన అక్షయ్ శర్మ అలియాస్ చోట జబ్బార్(20), బీహార్లోని మధుబని జిల్లా మాదేపూర్కు చెందిన సుమిత్కుమార్ ఝా అలియాస్ సుమిత్(21) ఉస్మాన్గంజ్ ప్రాంతంలో ఉంటూ బీకాం కంప్యూటర్స్ చదువుతున్నాడు. వీరిద్దరూ పదో తరగతి వరకు కలిసి చదవడంతో స్నేహితులుగా మారారు.
అక్షయ్ స్థానికంగా క్యాటరింగ్ సర్వీసెస్లో ఉద్యోగానికి చేరాడు. బైక్ దొంగతనాల్లో ఆరితేరిన చంచల్గూడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హాయ్ అజీమ్ మెహిదీ అలియాస్ జింగడ(23) అక్కడే పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు స్నాచింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో సుమిత్ను కూడా భాగస్వామిని చేశారు.
దూసుకుపోయే హైస్పీడ్ బైక్లను దొంగిలించిన జింగడ వీరికి ఇచ్చేవాడు. అక్షయ్, సుమిత్ వాటిపై వెళ్తూ ఒంటరిగా నిర్జన ప్రదేశంలో వెళ్లే మహిళలకు ఎదురుగా వచ్చి వారి మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కొని పారిపోయేవారు. ఒకటి రెండు స్నాచింగ్లు చేసిన తర్వాత తస్కరించిన ద్విచక్రవాహనాన్ని నిర్మానుష ప్రదేశంతో వదిలేసి వెళ్లేవారు.
ఇలా నాలుగు నెలల కాలంలో నారాయణగూడ, చిక్కడ్పల్లి, ముషీరాబాద్, గాంధీనగర్, బంజారాహిల్స్, అసీఫ్నగర్, టప్పాఛబుత్ర, కుల్సుంపురా, చార్మినార్, సుల్తాన్బజార్, బొల్లారం, రాజేంద్రనగర్, ఉప్పల్ తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో స్నాచింగ్లు చేశారు.
విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ టీం ఈ ముఠాను పట్టుకొని విచారించారు. 21 కేసుల్లో నిందితులైన ముగ్గురి నుంచి 46.5 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు అదనపు సీపీ వెల్లడించారు.
స్నాచర్లతో పాటు దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన గోషామహల్కు చెందిన వైరల్ దత్త హరిదాస్(21)ని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. బంగారంతో పాటు రెండు పల్సర్ బైక్లు, ఒక హోండా షైన్ బైక్, సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు వివరించారు. వీరిపై పీడీ యాక్టు ప్రయోగించనున్నట్లు వివరించారు.