కడుపు కోత మిగిల్చిన ఈత: చెరువులో మునిగి మగ్గురు చిన్నారుల మృత్యువాత
ఆ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఒకే సామాజిక వర్గీయులు. వరుసకు చిన్నాన్న, పెద్దనాన్న కుమారులు. అందరి కుటుంబాల్లో ఓ కుమారుడు, కూతురు సంతానం.
వరంగల్: ఆ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఒకే సామాజిక వర్గీయులు. వరుసకు చిన్నాన్న, పెద్దనాన్న కుమారులు. అందరి కుటుంబాల్లో ఓ కుమారుడు, కూతురు సంతానం. వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత నేర్చుకునేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గూడెం రాజయ్య, సరోజన దంపతులకు ఒక కొడుకు మనోజ్కుమార్(14), ఒక కూతురు. మనోజ్కుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేశారు. గూడెం మొగిలి, శ్రీలతలకు కొడుకు సాయికృష్ణ (12), ఓ కూతురు. సాయికృష్ణ వరంగల్ అర్బన్లోని మడికొండ సాంఘిక సంక్షేమ పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేశారు. గూడెం రాజేందర్, స్వర్ణలకు కొడుకు జ్యోతివర్ధన్(14), ఒక కూతురు ఉన్నారు. జ్యోతివర్ధన్ ఎల్కతుర్తిలోని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి పూర్తిచేశాడు.
ఈత నేర్చుకునేందుకు వెళ్లి...
గ్రామ శివారులోని మొండికుంట చెరువలో సరదాగా ఈత నేర్చుకునేందుకు మనోజ్కుమార్, సాయికృష్ణ, జ్యోతివర్ధన్లు వెళ్లారు. ఈత నేర్చుకునేందుకు ఒక్కొక్కరుగా చెరువులోకి దిగారు. వీరు దిగిన చోట లోతుగా ఉండటంతో మునిగిపోతూ కేకలు వేశారు. చెరువు పక్కనే పొలం వద్ద ఉన్న సమీప బంధువు మమతకు వీరి కేకలు వినిపిచడంతో పశు కాపురులను వెంట తీసుకొని చెరువు దగ్గరకు వెళ్లింది. ముందుగా జ్యోతివర్ధన్ను బయటకు తీశారు. అతను కొన ఊపరితో ఉండటాన్ని గమనించి ఆటోలో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మిగతా వారు సాయికృష్ణ, మనోజ్కుమార్లను బయటకు తీశారు. అప్పటికే వారు మృతిచెందారు. సమీప కుటుంబానికి చెందిన పిల్లల కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట ఏసీపీ జనార్థన్, ఎల్కతుర్తి సీపీ సతీష్చందర్రావు, ఉప తహసీల్దార్ రామారావులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
ములుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మహ్మద్గౌస్పల్లి వద్ద జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం రాత్రి సుమారు 8.40 గంటలకు రహదారిపై ట్రాలీ ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఎంజీఎంకు తరలించారు. మృతిచెందిన వారిలో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలం సొల్లపల్లికి చెందిన కావి కొమ్మాలు(40), నాజర్ (35), కాక్షపురం గ్రామానికి చెందిన నీలం పవన్(25) ఉన్నారు.
మృతిచెందిన ముగ్గురితోపాటు మరో నలుగురు ఆదివారం మధ్యాహ్నం ములుగు మండలం దేవనగర్ గ్రామపంచాయతీ శివారు శ్రీనగర్ సమీపంలోని మామిడితోటలో కాయలు తెంపుకొని ఆటోలో వరంగల్కు బయలుదేరారు. మహ్మద్గౌస్పల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా లారీ అతి వేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
దీంతో ట్రాలీ ఆటో నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కొమ్మాలు, నాజర్, పవన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులోనే ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. ములుగు సీఐ సాయి రమణ, ఎస్సై మల్లేష్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.