పెను విషాదం : కుక్కను రక్షించబోయి ముగ్గురి మృతి
మహబూబ్ నగర్ : పెంపుడు జంతువులను ఇంట్లో వాళ్లతో సమానంగా ప్రేమించేవాళ్లు చాలామందే ఉంటారు. ఏళ్లుగా ఉండే అనుబంధం వాళ్లను పెంపుడు జంతువులతో మమేకం చేస్తోంది. ఇదే తరహాలో ఓ కుక్కను పెంచుకున్న కుటుంబం.. కుక్కను ప్రమాదం నుంచి కాపాడబోయి తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం తోగాపూర్ పంచాయతీ పరిధిలోని హనుమపల్లికి చెందిని వెంకటయ్య, అతని భార్య, కుమారుడు, తమ కుక్కను రక్షించబోయి తామే ప్రాణాలు కోల్పోయారు. తమ పంట పొలానికి రక్షణగా ఉంటుందని ఓ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకుంది వెంకటయ్య కుటుంబం. అయితే ప్రమాదవశాత్తు తమ కుక్క విద్యుత్ కంచెకు తగలడంతో.. దాన్ని రక్షించడానికి ప్రయత్నించాడు వెంకటయ్య.
అయితే కంగారులో విద్యుత్ సరఫరాను నిలిపేయడం మరిచిపోయిన వెంకటయ్య.. విద్యుత్ ప్రసరిస్తుండగానే కుక్కను రక్షించబోవడంతో అతను కూడా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అనంతరం వెంకటయ్యను రక్షించబోయి అతని భార్య, కుమారుడు కూడా విద్యుత్ షాక్ గురై మరణించారు. దీంతో కుక్కు ప్రాణాలను కాపాడం కోసం కుటుంబమే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.