నిమజ్జనంలో విషాదాలు: ఏడుగురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన విషాద సంఘటనల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామం వద్ద నదిలో గణేశుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. మంగళవారంనాడు ఈ ఘటన చోటు చేసుకుంది.
కరీంనగర్కు 30 కిలోమీటర్ల దూరంలో గల నాగారం గ్రామానికి చెందిన చింతపల్లి సంజీవరావు (35), పోలసాని శ్రవణ్ (26), మందా రవి (30) మానేరు నదిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా కొట్టుకుపోయినట్లు జమ్మికుంట ఇన్స్పెక్టర్ చెప్పారు. ముగ్గురి మృతదేహాలను మంగళవారం ఉదయం వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మహబూబ్నగర్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నారాయణపేటలో విద్యుద్ఘాతానికి గురై ఒకరు మృతి చెందగా, కేశంపేట మండలం కాకునూర్లో చెరువులో పడి మరొకరు మృత్యువాతపడ్డారు. నారాయణపేటలోని గాంధీనగర్లో సోమవారం తెల్లవారుజామున గణేష్ నిమజ్జన ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ మెయిన్ లైన్ తీగలకు కొక్కెలు వేయబోయిన సంగ రాకేశ్(22) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి నవరాత్రుల పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. గ్రామ సమీపంలో ఉన్న పోచమ్మ చెరువులో నిమజ్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన వడ్ల రమేష్(21)చెరువులో పడి మృతి చెందాడు.
గణేష్ నిమజ్జనానికి వెళ్లిన విద్యార్థి మున్నేటి నీటిలో గల్లంతైన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగింది. మధిరకు చెందిన గోపీ (20) ఖమ్మంలో నిమజ్జనంలో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి మున్నేటి వాగు వద్దకు వెళ్లాడు. అక్కడ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మరో యువకుడితో కలిసి మున్నేటిలోకి దిగిన గోపి నీటి ప్రవాహ వేగానికి పట్టు తప్పి పడిపోయాడు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం మెండోర గ్రామంలో నిర్వహించిన గణేషుడి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో బెస్త వంశీ(16) అనే యువకుడు మృతి చెందాడు. సోమవారం రాత్రి గణేష్ శోభా యాత్ర నిర్వహిస్తూ అలంకరణ లైట్లకు కరెంట్ కోసం విద్యుత్ తీగలకు కొండీలు తగిలించగా ట్రాక్టర్ బాడీకి షాక్ వచ్చి, దానిపై కూర్చున్న వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు.