ట్రిపుల్ మర్డర్స్: అపర్ణను వదిలేయమని యామిని, మరొకరితో సన్నిహితంగా.. సహజీవనంపై మధు ట్విస్ట్
Recommended Video
హైదరాబాద్: చందానగర్లో సంచలనం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడి నుంచి పోలీసులు సమాచారం రాబడుతున్నారు. విచారణలో భాగంగా స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం, ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉండటంతో హత్య చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
హైదరాబాదులో మరో దారుణం: బండరాయితో మోది బీటెక్ విద్యార్థిని అనూష హత్య
వేముకుంటలోని ఓ అపార్టుమెంటులో జయలక్ష్మి (50), కూతురు అపర్ణ (30), మనవరాలు కార్తికేయి (4) రెండు నెలలుగా ఉంటున్నారు. సోమవారం ఉదయం పాలుపోసే వ్యక్తి వచ్చి చూడగా వారి ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉండగా, ఇంట్లోంచి దుర్వాసన రావడంతో యజమానికి చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ముగ్గురు హత్య ఉదంతం వెలుగు చూడగా, ఆ తర్వాత నిందితుడు మధును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే.
మధు మొదటి భార్య కూడా వేధించేది
మధు-అపర్ణలు ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారని అపర్ణ బంధువులు చెబుతున్నారు. మధుకు మొదటి భార్య ఉందని తెలిసినప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాదు, మధు మొదటి భార్య యామిని కూడా అపర్ణను వేధించేదని చెప్పారు.
భోజనం చేసి వస్తానని చెప్పి వెళ్లిన అపర్ణ తిరిగి రాలేదు
పోలీసులు వేములకుంటలోని ఫ్లాట్ పరిసరాల్లో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. అపర్ణ సెల్ ఫోన్ కాల్ డేటాను చూశారు. చందా నగర్లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి శనివారం గం.2.48 గంటలకు విధుల నుంచి ఆమె బయటకు వస్తున్నట్లుగా సీసీ ఫుటేజీలో ఉంది. భోజనం చేసి వస్తానని చెప్పి వెళ్లిన అపర్ణ రాలేదు. ఆ తర్వాత గం.3.30కు సహచర ఉద్యోగి ఫసీయుద్దీన్ ఫోన్ చేయగా కలవలేదు.
ఒత్తిళ్లు, రెండు నెలలుగా గొడవలు
అపర్ణ - మధులకు వివాహం జరిగిందని కొందరు చెబుతుండగా, సహజీవనం చేస్తున్నారని కూడా అంటున్నారు. మొబైల్ షాప్ నిర్వహిస్తున్న మధు చాటుమాటుగా అపర్ణ, యామిణిలతో కాపురం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అపర్ణను వదిలేయమని మొదటి భార్య నుంచి ఒత్తిడి రావడం, అదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని అపర్ణ బలవంతం చేయడంతో ఇద్దరి మధ్య రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ఇష్టంలేక
అపర్ణతో సహజీవనం చేస్తున్నానని, కానీ ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక తాను హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడని తెలుస్తోంది. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని ఆయన అనుమానించడం కూడా హత్యకు కారణంగా భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం అపర్ణ ఇంటికి రాగానే తలుపు తీశానని, వెంటనే ఆమె తలను గోడకు వేసి బాది చంపానని చెప్పాడని తెలుస్తోంది.
అందుకే లొంగిపోయాడు
జయలక్ష్మి, కార్తికేయి, అపర్ణలను చంపిన తర్వాత నిందితుడు పారిపోయాడు. సోమవారం విషయం బయటకు పొక్కడంతో చందానగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విచారణలో అతను తాను అపర్ణను పెళ్లి చేసుకోలేదని, సహజీవనం మాత్రమే చేశానని అతను చెబుతుండటంతో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేస్తున్నారు.
కార్తికేయి చనిపోయిందని తెలిసి కన్నీరు
ఇదిలా ఉండగా పోలీసులు రూప్ లాల్ అనే వ్యక్తిని కూడా విచారించారని తెలుస్తోంది. కాగా, చిన్నారి కార్తికేయి కాలనీలో అందరితో కలివిడిగా ఉండేదని, చుట్టుపక్కల వారిని ఆంటీ, అంకుల్ అంటూ ఆడుతూపాడుతూ ఉండేదని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఉల్లంపర్రులోని మధు, అపర్ణల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగారు.