విందు కాదది విషం.. ఫుడ్ పాయిజనింగ్తో ముగ్గురు చిన్నారుల మృతి..
నార్నూర్ : పెళ్లి సందడితో అప్పటి వరకు కళకళలాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. వివాహానికి వచ్చిన బంధువుల ముచ్చట్లు, నవ్వులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదనలు మిన్నంటాయి. వివాహ విందు కోసం వండిన వంటలు విషంగా మారడంతో ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అందరి హృదయాలను కలిచివేసే విషాదకర ఘటన ఆదిలాబాద్లో జరిగింది.
ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ! ప్రియుడితో గొడవపడి ప్రియురాలి ఆత్మహత్య!
విషంగా మారిన విందు భోజనం
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి హెచ్ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో సోమవారం పెళ్లి జరిగింది. మంగళవారం గ్రామంలో మాంసాహారంతో విందు ఏర్పాటుచేశారు. అయితే కొంత ఆహారం మిగిలిపోవడంతో బుధవారం కొందరు దాన్ని తిన్నారు. చిన్నపిల్లకు సైతం తినిపించారు. అయితే అప్పటికే ఆ మాంసాహారం పాడై పోవడంతో అది కాస్తా పిల్లల పాలిట విషంగా మారింది. ఆ ఆహారం తిన్న వెంటనే పిల్లలతో పాటు పెద్దలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.
3 చిన్నారులు మృతి, 20మందికి అస్వస్థత
ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఏడాది వయసున్న చిన్నారి గ్రామంలో ఉండగానే చనిపోయాడు. మరో ఇద్దరు చిన్నారులను నార్నూర్, ఉట్నూర్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న మరికొంత మందిని నార్నూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు.
కేసు నమోదుచేసిన పోలీసులు
మాంసాహారం తిని ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అనారోగ్యం పాలైన వారందరికీ రిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు పుడ్ పాయిజనింగ్కు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఏటీడీఏ అధికారులు గ్రామాన్ని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.