యాదాద్రిలో ఘోర ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి..
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి ఎల్లంకి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులను సర్నెనిగూడెం సర్పంచ్ భర్త మధు,కుమారుడు మత్స్యగిరి, డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా గుర్తించారు. కారును స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
శుక్రవారం కారులో బయటకు వెళ్లిన ఈ ముగ్గురు రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో వెతికిన పోలీసులు.. విచారణలో భాగంగా ఎల్లంకి గ్రామంలోని సీసీటీవి ఫుటేజీని పరిశీలించారు. కారు చెరువు కట్టపై నుంచి వెళ్లినట్టు అందులో గుర్తించారు. దీంతో చెరువు వద్ద వెతకగా.. నీళ్లలో మునిగిపోయిన కారును గుర్తించారు. జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణలో ఇటీవల వరుసగా కారు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్ సమీపంలోని అలుగునూరు వంతెనపై నుంచి ఇటీవల ఓ కారు కిందపడిపోయిన సంగతి తెలిసిందే. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ సైతం వంతెనపై నుంచి పడి మృతి చెందాడు. ఇక మరో ఘటనలో అలుగునూరు సమీపంలోని కాకతీయ కెనాల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం శవాలై తేలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.