వీకెండ్ బీభత్సం : హైదరాబాద్లో వరుస కారు ప్రమాదాలు.. ముగ్గురు మృతి
హైదరాబాద్లో వీకెండ్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. స్నేహితులతో కలిసి రాత్రిపూట మద్యం సేవించి.. రయ్యిమంటూ రోడ్ల పైకి దూసుకొస్తున్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్ని డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఘటనలో యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
Recommended Video
కర్మన్ఘాట్లో కారు ప్రమాదం
మల్లిఖార్జున్,సాయిరామ్, సాయినాథ్,కల్యాణ్ అనే నలుగురు స్నేహితులు శనివారం రాత్రి గుర్రం గూడలో ఓ గెట్ టు గెదర్ పార్టీకి వెళ్ళి ఆదివారం తెల్లవారుజామును చంపాపేట్ బయలుదేరారు. ఈ క్రమంలో కారు కర్మన్ఘాట్ సమీపంలో అదుపు తప్పి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. కల్యాణ్ అనే యువకుడు సీట్ బెల్టు పెట్టుకున్న కారణంగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఆస్పత్రిలో కల్యాణ్..
ప్రమాదంలో గాయపడ్డ కల్యాణ్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కల్యాణ్,సాయినాథ్లు ఫిలిప్స్ కంపెనీలో మార్కెటింగ్ చేస్తున్నట్టు సమాచారం. మరో స్నేహితుడు మల్లిఖార్జున్ ఖాళీగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో సరదాగా బయటకెళ్లిన వీరు.. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ముగ్గురు యువకులు మృతి చెందడంతో.. వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బంజారాహిల్స్లో మరో ఘటన..
మరో ఘటనలో బంజారాహిల్స్ రోడ్ నం.3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపు తప్పి పక్కనే ఉన్న రాయల్ టిఫిన్స్ హోటల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత అందులో ఉన్న యువకులు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు.కారు నంబర్,సీసీటీవి ఫుటేజీ ఆధారంగా యువకులను గుర్తించే పనిలో పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.