యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నుజ్జునుజ్జయిన కారు... ముగ్గురు అక్కడికక్కడే మృతి
యాదాద్రి భువనగరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు,ఒక వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఒక కారు పూర్తిగా నుజ్జునుజ్జవగా... మరో కారు కూడా ధ్వంసమైంది. రెండో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్కి చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం(డిసెంబర్ 24) ఉదయం ఆలేరులో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై సాయంత్రం నగరానికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు,ఓ వాటర్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇంతలో వెనకాలే వచ్చిన మరో కారు కూడా ఈ రెండు వాహనాలను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
మొదటి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి ముగ్గురు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు. అందులోనుంచి బయటకు రాలేక కొంతసేపటి వరకు ఆర్తనాదాలు చేశారు. స్థానికులు గమనించి వారిని బయటకు తీసినప్పటికీ అప్పటికే వారు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన మరో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. టోల్ ప్లాజా సమీపంలోనే ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పైనుంచి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోనూ ఓ కారు ట్యాంకర్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. తిరుమల దర్శనానికి వెళ్లి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్దారించారు.