ఎంజీఎం ఆస్పత్రిలో అర్ధరాత్రి తుపాకీ కలకలం: ఇద్దరు మహిళలతోపాటు వ్యక్తి అరెస్ట్
వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి తుపాకీతో కలకలం సృష్టించాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఆస్పత్రి ఆవరణలోని చెట్టు కింద మహిళతో పాటు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.
దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా అతడి వద్ద ఉన్న తుపాకీని బయటకు తీశాడు. ఖంగుతిన్న పోలీసులు, తక్షణమే ప్రతిఘటించి అతడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో వారితో పాటు మరో అనుమానిత మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
బొల్లారం వద్ద రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
హైదరాబాద్ నగరంలోని బొల్లారం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బొలేరో వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యాదగిరి గుట్ట నుంచి కోంపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.