అమ్మాయిలు స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఆకతాయిలు
నిజామాబాద్: విద్యార్థినులు స్నానం చేస్తున్న దృశ్యాలను ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ ఘటన బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసిపేటలోని సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో జరిగింది.
అమ్మాయిలు స్నానం చేస్తుండగా బాతరూం వెనకవైపు నుంచి విద్యార్థులు వీడియో తీశారు. విషయాన్ని గమనించిన విద్యార్థినులు కేకలు వేయడం తో స్థానికులు ముగ్గురిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు పరారు కాగా, ఒక విద్యార్థి చిక్కాడు. అతడిని పోలీసులకు అప్పగించారు.
న్యూసెన్స్ చేసిన ఆ ముగ్గురు విద్యార్థులపై సుమోటో కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ ఛామకూర వెంకన్న తెలిపారు. మూడురోజులుగా వసతి గృహం విద్యార్థినులను ఓ ముగ్గురు విద్యార్థులు వికృత చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తుండడం గుర్తించిన ఆయా వసతిగృహ అధికారికి ఫిర్యాదు చేశారు.
ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో సదరు వసతిగృహం అధికారిని వివరణ కోరితే తాను మరో ఐదు రోజుల్లో బదిలీపై వెళ్తానని తనకు ఏ విషయం తెలియదంటూ దాటవేశారు.
పట్టణంలోని సమీకృత బాలికల వసతిగృహం విద్యార్థినులను వేధించిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థినులను వీడియో తీశారని ఈ విషయంలో పోలీసులు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇందుకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు ఎం.శివకుమార్, నాగరాజు ఆర్డీవో కార్యాలయంలోని అధికారి డేవిడ్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మోహన్, శేఖర్, అన్వేష్, రాజన్న, రవి, వెంకట్ ఉన్నారు.