ఘరానా దొంగల అరెస్ట్: 21లక్షల నగదు, కిలో బంగారం, 8వాహనాలు సీజ్(ఫొటోలు)
హైదరాబాద్: వేర్వేరు కేసుల్లో నిందితులైన ముగ్గురు ఘరానా దొంగలను కూకట్పల్లి, రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.21లక్షల నగదు, కిలోకుపైగా బంగారు ఆభరణాలు, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సైబారాబాద్ కమిషరేట్లో సోమవారం మీడియా సమావేశంలో డీసీపీ(క్రైం) నవీన్కుమార్ వివరాలు వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా కొంకపల్లి గ్రామానికి చెందిన పతివాడ గణేష్(25) 2007వ సంవత్సరం నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. అప్పట్లో అతన్ని అమలాపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడులయ్యాక రాత్రిపూట ఇళ్లను కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. అదే జిల్లా బొమ్మూరులో చోరీ కేసులో అరెస్టు అయ్యాడు.
ఆ తర్వాత రాజోల్ పోలీసులు 15 చోరీ కేసుల్లో అతడిని అరెస్టు చేశారు. ఆ కేసులో అతడికి ఐదేళ్ల జైలు శిక్షపడగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాడు. 2014 విడుదలయ్యాక తిరిగి అమలాపురంలో దొంగతనాలకు పాల్పడి అరెస్టయ్యాడు. 2015 నవంబరు బయటికి వచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో చోరీలు చేశాడు. ఆ తర్వాత నగరానికి వచ్చి జల్సా జీవితం గడుపుతున్నాడు.
సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంతనం చేసి పారిపోయేందుకు యత్నిస్తుండగా.. కూకట్పల్లి సీసీఎస్, సనత్నగర్ పోలీసులు అతడిని ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పట్టుకున్నారు. రూ.21లక్షల నగదు, 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. యలమంచిలిలో రూ.9లక్షలు, 73 తులాల బంగారు ఆభరణాలను దొంగలించినట్లు విచారణలో బయటపడింది.
ఇది ఇలా ఉండగా, అనంతపూర్ జిల్లా గుంతకల్కు చెందిన శికారి సర్దార్ అలియాస్ శికారి శంకర్(50) పార్థీ ముఠాకు చెందిన కరుడగట్టిన దోపిడీ కేసుల్లో నిందితుడు. హైవేలపై వాహనాలను నిలిపి దోపిడీలు చేస్తుండేవాడు. ఆ తర్వాత ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించాడు. అనేక సార్లు అతడిని పోలీసులు అరెస్టు చేశాడు.
ప్రస్తుతం కర్ణాటక గుల్బర్గలో నివసిస్తున్నాడు. రెండేళ్ల క్రితం జైలు నుంచి విడులయ్యాక అతడు మద్దిలేటి, చోటూలతో కలిసి అల్వాల్, పేట్బషీర్బాద్, దుండిగల్, చందానగర్, పరిగి ఠాణాల పరిధిలో 16 చోరీలు చేశాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ సీసీ పోలీసులు అతడిని పట్టుకుని 16 కేసులకు సంబంధించిన 47 తులాల పసిడి నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సహచరులు పరారీలో ఉన్నారు.
మరో కేసు విషయానికొస్తే.. కర్ణాటక రాయచూరు అధోర్ ఖిలాకు చెందిన సయ్యద్ అక్బర్ డ్రైవర్. వాహనం కనిపిస్తే మాయం చేస్తుంటాడు. అతడిని పోలీసులు నాలుగు సార్లు అరెస్టు చేశారు. గతేడాది 8 కార్లు దొంగలించాడు. వాటిలో ఒక లాన్సర్, టాటా ఇండికా, మూడు మారుతీ జెన్, రెండు మారుతీ 800, ఒక టాటా ఏస్ ట్రక్కులున్నాయి. మారేడుపల్లి, చాంద్రాయణగుట్ట, సంతోష్నగర్, మీర్పేట పీఎస్ల పరిధిలో వాటిని మాస్టర్ తాళం ఉపయోగించి తస్కరించినట్లు డీసీపీ తెలిపారు.
రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు నిందితుడిని పట్టుకుని 8 వాహనాలు స్వాధీనపర్చుకున్నారు. కూకట్పల్లి, రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్లు సి.హరీష్చంద్రారెడ్డి, పి.శ్రీధర్రెడ్డి నేతృత్వంలో ఎస్ఐలు కె.బాలరాజు కె.రాజేంద్ర, బి.రవికుమార్, డి.వెంకటేశ్, కె.నర్సింహ, ఎండీ సయ్యద్ సిబ్బంది నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.