మూడు వేల మంది పోలీసులు.. మూడంచెల భద్రత.. ఐనా ప్రగతి భవన్ గడీని ఢీ కొట్టిన రేవంత్ రెడ్డి..!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి సమ్మెతో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఆర్టీసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల దగ్గర మోహరించి నాయకులను చాలా వరకు హౌస్ అరెస్టు చేసారు. ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్న కొంత మంది నాయకులను దారిలో అరెస్టు చేసారు. ఐతే మల్కజిగిరి ఎంపి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పై రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఉదయం ఆరు గంటల నుండే రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మొహరించారు.
మెరుపులా వచ్చిన రేవంత్.. ఉరుములా ప్రగతి భవన్ ను ముట్టడించారు..
రేవంత్ రెడ్డిని మొదట హౌస్ అరెస్టు చేయాలని భావించిన పోలీసులకు ఆయన ఇంట్లో కనిపించలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎక్కడికి వెళ్లారో తెలియదని చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్ధితులు తలెత్తాయి. సగం నగరాన్ని జల్లెడ పట్టిన పోలీసులు రేవంత్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోలేకపోయారు. తర్వాత అనుకున్న సమయానికి ఇంట్లోనుండి మెరుపులా ప్రగతి భవన్ ముట్టడికి బలయల్దేరారు రేవంత్ రెడ్డి. కొద్ది దూరం తన వాహనంలో ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి పోలీసులను ఏమార్చేందుకు వాహనం దిగి బుల్లెట్ పై ప్రగతి భవన్ చేరుకున్నారు. కానీ కారులోనే ఉన్నారని భావించిన పోలీసులు కారును వెంబడించారు.
బుల్లెట్ మీద దూసుకొచ్చిన రేవంత్..! ప్రగతి భవన్ ముందు సవాల్ చేసిన ఎంపి..!!
ఈలోపు బుల్లెట్ పై రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముందుకు చేరుకున్నారు. ప్రగతి భవన్ ప్రధాన ద్వారం వద్ద వేసిన కంచెను తొలగించే క్రమంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐతే మూడు వేల మంది పోలీసులు పహారా కాస్తున్నా, ప్రగతి భవన్ చుట్టు పక్కల ఒక కిలో మీటర్ వరకు మూడంచెల భద్రత వలయాలు ఉన్నా రేవంత్ రెడ్డిని పోలీసులు గుర్తించలేక పోయారు. ప్రగతి భవన్ ప్రధాన ద్వారం దగ్గరకు బుల్లెట్ లా దూకొచ్చిన రేవంత్ రెడ్డి అంతే వేగంతో లోపలకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. అప్రమత్తమైన పోలీసులు రేవంత్ ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్ది గర్జన పరిస్ధితులను గుర్తు చేసిన రేవంత్..!పోలీసు యంత్రాంగం ఒక్కటైనా పట్టుకోలేక పోయారు..!!
ఇదిలా ఉండగా 2016లో ఫీసు రీఎంబర్స్ మెంట్ అంశంలో ఉస్మానియా యునివర్సిటీలో విద్యార్దులు లత పెట్టిన విద్యార్దగర్జన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అథిధి గా వెళ్లాల్సి ఉంది. కాని పోలీసులు రేవంత్ రెడ్డిని ఉస్మానియా ప్రాంగణలోకి అడుగు పెట్టనివ్వమని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసేందకు అన్ని విధాల ప్రయత్నించారు. కాని సాయంత్రం సరిగ్గా విద్యార్థి గర్జన కార్యక్రమానికి హెల్మెట్ ధరించి, ఆక్టీవా ద్విచక్ర వాహనంపై నేరుగా స్టేజీ సమీపానికి చేరుకున్న రేవంత్ రెడ్డిని విద్యార్థులు ఎత్తుకుని వేదిక మీదకు తీసుకెళ్లారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. ఎంత మంది పోలీసులు పహారా కాస్తున్నా వారి కళ్లను కప్పి ఉస్మానియా యూనివర్సిటీ లోకి చేరుకున్న రేవంత్ సాహసాన్ని చాలా మంది ప్రశంసించారు.
కాంగ్రెస్ సీనయర్ నేతలంతా హౌస్ అరెస్టు..! ప్రగతి భవన్ ని ముట్టడించింది మాత్రం రేవంత్ ఒక్కడే..!!
తాజాగా నేడు కూడా అలాంటి పరిస్ధతులే పునరావృతమయ్యాయి. పెద్ద ఎత్తున పోలీసులు మఫ్తీలో ఉన్నప్పటికి, నిఘా వర్గాలు ప్రత్యేక నజర్ పెట్టినప్పటికి రేవంత్ రెడ్డి చాకచక్యంగా ప్రగతి భవన్ చేరుకోవడం పట్ల ఉన్నతాదికారులు సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, టీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మరికొంత మంది నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. జగ్గా రెడ్డి ని పంజాగుట్ట చౌరస్తాలో అరెస్టు చేసారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే ప్రగతి భవన్ గడీని తాకగలిగారనే చర్చ జరుగుతోంది.