ఫ్రెండ్షిప్ డే నాడు విషాదం... గోదావరిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు స్నేహితులు గల్లంతు...
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందిపేట మండలంలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలకు గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో చాలామంది పర్యాటకులు నది తీర అందాలను ఆస్వాదించేందుకు వెళ్తున్నారు. ఆదివారం(అగస్టు 1) స్నేహితుల దినోత్సవం కావడంతో నిజామాబాద్ జిల్లా అర్సపల్లికి చెందిన ఆరుగురు స్నేహితులు కలిసి గోదావరి అందాలు వీక్షించేందుకు వెళ్లారు. అక్కడికెళ్లాక నదిలో స్నానం చేసేందుకు లోపలికి దిగారు.
నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు గల్లంతవగా... మరో ముగ్గురిని ఓ రైతు కాపాడినట్లు సమాచారం. గల్లంతైన యువకుల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడటంతో మృతదేహాల గాలింపు కష్టంగా మారింది. నందిపేట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో ఇదే నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నదిలో ఏడుగురు యువకులు గల్లంతయ్యారు.మెండోరా మండలం పోచంపాడు పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానం కోసం దిగిన ఈ ఏడుగురు... ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.విషయం తెలుసుకున్న స్థానికులు గల్లంతైనవారి కోసం గాలించగా ఒకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మిగతా ఆరుగురు గల్లంతయ్యారు.వీరంతా నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
కొద్ది నెలల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇద్దరు యువకులు గోదావరి ప్రవాహంలో గల్లంతయ్యారు.పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు గోదావరి నది వద్దకు వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. మృతులను జమ్మి షణ్ముఖరావు (23),నిమ్మల హరిచంద్ (25)లుగా గుర్తించారు. నదిలో కుక్కకు స్నానం చేయిస్తున్న క్రమంలో అది లోతు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లింది. దీంతో దాన్ని కాపాడే ప్రయత్నంలో హరిచంద్, షణ్ముఖరావు అటువైపు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. ఇంకా ఆ ఇద్దరు యువకుల జాడ తెలియరాలేదు.