అమ్మాయి ప్రేమ ఇష్యూ: టెక్కీని హత్య చేసిన యువకులు, ఇలా వెలుగులోకి
హైదరాబాద్: ఓ టెక్కీ హత్య కలకలం రేపుతోంది. హైదరాబాదులో ముగ్గురు యువకులు కలిసి ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ను హత్య చేశారు. ఈ హత్య విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఆ ముగ్గురు యువకుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు.
దీంతో విషయం వెలుగు చూసింది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి అసలు విషయం చెప్పాడు. తాము ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ను హత్య చేశామని, ప్రేమ వ్యవహారమే అందుకు కారణమని అతను చెప్పాడు. గుట్టు విప్పిన యువకుడి పేరు నరేష్.
నరేష్ ఆత్మహత్యాయత్నం
నరేష్ లాలాగూడలో ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను బ్లేడుతో గొంతును కోసుకున్నాడు. ఇలా ఎందుకు చేశావని అడిగితే విషయం చెప్పాడు. ముగ్గురం కలిసి ఓ టెక్కీని హతమార్చినట్లు చెప్పాడు. తమ స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో అడ్డు వస్తున్నాడని టెక్కీని హత్య చేసినట్లు చెప్పాడు.
ఆ రోజు ఏం జరిగిందంటే
ఈ సంఘటన అయిదు రోజుల క్రితం జరిగినట్లు చెప్పాడు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన టెక్కీని పిలిపించి మద్యం తాగినట్లు చెప్పాడు. అతనిని అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేశామని, ఆ తర్వాత చంపినట్లు చెప్పాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం నల్గొండ జిల్లాలోని ఓ చెరువులో పడేసినట్లు చెప్పాడు.
హత్య బయటపడుతుందని
నరేష్ లాలాపేటలో ఓ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతను చెప్పడంతో ఐదు రోజుల తర్వాత విషయం వెలుగు చూసింది. హత్య ఎక్కడ బయటపడుతుందో, ఈ కేసులో తాను కూడా ఇరుక్కుంటానేమోనని భయపడి అతని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా చెప్పాడని తెలుస్తోంది.
కేసు నమోదు దర్యాఫ్తు
ఆత్మహత్యాయత్నం చేసిన నరేష్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పోలీసులు విచారించారు. కాగా, మృతుడి పేరు దీపక్ అని తెలుస్తోంది. అతని మృతదేహాన్ని గుర్తించాలని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.